ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫర్నీచర్ వెనక్కి ఇచ్చేయండి.. వైఎస్ జగన్‌కు ప్రభుత్వం లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 07:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఫర్నీచర్ రాజకీయం వేడెక్కుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ సొమ్ముతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఫర్నీచర్ కొనుగోలు చేశారని.. అయితే ప్రభుత్వం మారినప్పటికీ ఇంకా వాటిని తిరిగి అప్పగించలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఫర్నీచర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు లేఖ రాశామని.. విలువ కట్టి చెప్తే ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ నేతలు కూడా ధీటుగా స్పందించారు. దీనిపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ను వెంటనే తమకు అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖరాసింది.


ఏపీ ప్రభుత్వం నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు ఈ లేఖ రాశారు. అలాగే జగన్ హయాంలో సీఎంవోలో పనిచేసిన సెక్రటరీలకు కూడా లేఖలు పంపినట్లు సమాచారం. ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతరత్రా సామాగ్రిని వెనక్కి పంపాలని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్.. తన క్యాంపు కార్యాలయం కోసం ప్రభుత్వ నిధులతో సామాగ్రిని కొనుగోలు చేశారు. అయితే ఫలితాలు వెలువడి అధికారం మారిన నేపథ్యంలో వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లోగా వాటిని సరెండర్ చేయాలని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫర్నీచర్ వెనక్కి పంపాలంటూ జీఎడీ అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది.


మరోవైపు ఫర్నీచర్ అప్పగింత విషయమై ఇప్పటికే టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఫర్నీచర్ అప్పగించడం లేదంటూ టీడీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం విలువ కట్టి చెప్తే ధర చెల్లిస్తామని లేఖ రాశామని చెప్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫర్నిచర్ అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి వైఎస్ జగన్‌కు లేఖ రాయటం ఆసక్తికరంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com