ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ భేటీ ఆరోజే.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 07:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకూ మాత్రం.. మంత్రివర్గ సమావేశం జరగలేదు. మంత్రులకు శాఖల కేటాయింపు, బాధ్యతల స్వీకరణ పూరైన నేపథ్యంలో జూన్ 24వ తేదీ ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం తొలిసారిగా భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెక్రటేరియట్‍లో ఉదయం పది గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని.. అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. 24వ తేదీ ఏపీ కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో జూన్ 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోగా చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం పేర్కొంది.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తొలిసారిగా భేటీకానుండటంతో భేటీపై ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్ల మీద సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, సామాజిక పింఛన్ల పెంపు, నైపుణ్య గణన ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ భేటీలో ఈ ఫైళ్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ, జనసేన కూటమి పలు హామీలు ఇచ్చింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాఅం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సహా పలు కీలకమైన హామీలు ఇచ్చింది.


ఇక ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశం ఉంది. చంద్రబాబు సంతకం చేసిన అంశాలకు ఆమోదం తెలపడంతో పాటుగా.. ఏయే పథకాలను ఎలా అమలుచేయాలనే దానిపైనా.. మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త ప్రభుత్వంలో తొలి కేబినెట్ భేటీ జరగనుండటంతో రాష్ట్ర ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా శుభవార్తలు వింటామా అనే ఆసక్తిలో ఉన్నారు.


మరోవైపు జూన్ 21, 22వ తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటాయి. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేశారు. అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఉండగా.. ఆయన తర్వాత స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. చంద్రబాబు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com