ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై అక్కడా దర్శన టికెట్ల స్కానింగ్, అలా చేసేవారిపై కఠిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 07:24 PM

తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు కొత్త ఈవో జే శ్యామలరావు. టీటీడీ రెవెన్యూ-పంచాయతీ రాజ్, రిసెప్షన్, ఐటీ విభాగాలపై సమీక్ష చేశారు. అలాగే అంశాలవారీగా మార్పులు మొదలయ్యాయి. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఆయన జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌లతో పాటూ ఆయా శాఖల అధిపతులతో సమీక్షించారు. అనంతరం వారికి పలు కీలక సూచనలు చేశారు. శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్‌ను పునఃప్రారంభించాలని ఐటీ విభాగానికి ఈవో సూచించారు. ఏపీఎస్‌ఆర్టీసీ, టూరిజం కోటాలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు.


అంతేకాదు తిరుమలలో తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఈవో అధికారులకు సూచించారు. అలాగే భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదేపదే గదులు తీసుకుంటున్న దళారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజిలెన్స్ అధికారులని ఆదేశించారు. అనంతరం నారాయణగిరి షెడ్‌ల వద్ద వైకుంఠం కంపార్ట్‌మెంట్‌ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డును భక్తుల సమాచారం కోసం ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు సూచించారు.


రెవెన్యూ-పంచాయతీ రాజ్ శాఖపై సమీక్షించిన ఆయన, తిరుమల స్థానికులకు కేటాయించిన ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, వాటి అద్దెలు, డోనర్ కాటేజీలకు సంబంధించి భూముల కేటాయింపు, ముడి సరుకుల అనుమతుల గురించి సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. యాత్రికుల రద్దీ అధికంగా ఉండి దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న క్యూ లైన్‌లను పర్యవేక్షించడానికి తక్షణమే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈవో)ని ప్రత్యేకంగా నియమించాలని ఈవో ఆదేశించారు. ఆరోగ్యం, అన్నప్రసాదం, శ్రీవారి సేవకు చెందిన అధికారులతో కూడిన ఓ బృందం ఏ ఈ ఓ తో ఎప్పటి కప్పుడు సమన్వయించుకుంటూ ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమాచారంతో త్వరగా దర్శనం కల్పించడానికి కృషి చేయాలని


ఆయన చెప్పారు.


తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం శ్రీసుందరరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీసుందరరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో మూడో రోజైన బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో గోవింద రాజన్, సూపరిండెంట్ మధు, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com