ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు రావడంతో మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జామున నుంచే భక్తులు పరమశివుని ధర్శనం కోసం ఆలయం ప్రాంగణంలోని క్యూలైన్లల్లో వేచి ఉన్నారు. మరికొందరు భక్తులు రుద్రగుండం, పూల కోనేర్లల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవస్థానానికి చెందిన వసతి గదులు శనివారం సాయంత్రమే భక్తులతో నిండిపోయాయి. దీంతో సమీపంలోని ప్రైవేట్ సత్రాలతో పాటు లాడ్జీల్లో భక్తులు విడిది చేశారు. అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారి పార్వతి మహానందీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆమె వెంట ఈవోఆర్డీ శివనాగజ్యోతి, పంచాయతీ కార్యదర్శి నాగసంజీవరావు ఉన్నారు.