ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరెస్సెస్, బీజేపీ మధ్య విబేధాలు.. మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్‌ కీలక భేటీ

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 10:06 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, కనీసం మెజార్టీ మార్కును అందుకోకపోవడం పట్ల ఆ పార్టీ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీపై పరోక్షంగా ఆరెస్సెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ఆరెస్సెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అహంకారంతోనే ఈ ఎన్నికల్లో భారీగా సీట్లు తగ్గిపోయాయని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆరెస్సెస్‌కు, బీజేపీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గిపోయిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్‌.. భేటీ కావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అంతేకాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గురువారం జరిగిన ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన మోహన్ భగవత్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బయటికి చెప్పకున్నా బీజేపీపై ఆరెస్సెస్ కోపంగా ఉందని పేర్కొన్నారు. మోహన్ భగవత్ మాత్రమే కాకుండా ఇతర ఆరెస్సెస్ నేతలు కూడా బీజేపీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఇక మణిపూర్ సమస్యపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన మోహన్ భగవత్.. గత ఏడాది కాలంగా మణిపూర్‌లో శాంతి నెలకొనలేదని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఇక ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. అహంకారులుగా వ్యవహరించిన వారిని ఆ శ్రీరాముడు కేవలం 241 వద్దే అడ్డుకున్నాడని మండిపడ్డారు. మరోవైపు.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఆరెస్సెస్ శ్రేణులు.. బీజేపీకి మద్దతు తెలపలేదని తెలుస్తోంది. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆరెస్సెస్‌ను బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ పరాజయానికి ఇదే కారణమని చెబుతున్నారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 36 సీట్లకే పరిమితం అయింది. ఇందులో బీజేపీకి సొంతంగా 33 సీట్లు మాత్రమే దక్కించుకుంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 60 కి పైగా సీట్లు సాధించగా.. ఈసారి సగానికి పడిపోయింది. ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ పరాజయం పాలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com