ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ స్పీకర్‌ పదవి ఆయనకే.. హింట్ ఇచ్చిన బీజేపీ

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 09:55 PM

కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 18 వ లోక్‌సభ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఎవరూ అనే ఉత్కంఠ నెలకొంది. అయితే గత రెండు ఎన్నికల్లో లాగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షాల సాయం అవసరం అయింది. ఈ క్రమంలోనే ఎన్డీఏలో కీలక పార్టీలు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ పదవిపై కన్నేశాయి. అయితే బీజేపీ మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి.. స్పీకర్ పదవిని తమ పార్టీ ఎంపీకే కట్టబెట్టాలని యోచిస్తోంది. అయితే లోక్‌సభ స్పీకర్ ఎవరూ అనే దానిపై బీజేపీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.


జూన్‌ 24 వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత 25 వ తేదీన స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. అనంతరం ఈనెల 26 వ తేదీన లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరిని వరించనుంది అనేది ప్రస్తుతం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.


2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో.. మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా బీజేపీకి సొంతంగా మెజారిటీ మార్కు సీట్లు రావడంతో.. ఆ పార్టీకి చెందిన ఎంపీలనే లోక్‌సభ స్పీకర్లుగా నియమించారు. 2014 లో సుమిత్రా మహాజన్‌ను, 2019 లో ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీనే ప్రతిపాదించి ఎంపిక చేశారు. దీంతో ఈసారి కూడా మోదీ సూచించిన వ్యక్తినే లోక్‌సభ స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టే అవకాశాలు ఉన్నాయి.


అయితే లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో.. ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా స్పీకర్ పదవిపై ఓ కన్నేశాయి. మరీ ముఖ్యంగా టీడీపీ, జేడీయూలు లోక్‌సభ స్పీకర్ పదవి దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఎవరు అనే అంశంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే బీజేపీకి చెందిన ఎంపీయే లోక్‌సభ స్పీకర్‌గా ఉంటారని జేడీయూ స్పష్టం చేసిన నేపథ్యంలో అది బీజేపీకే దక్కుతుందా లేక.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ ఎంపీకి ఇప్పించుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది.


ఇక మరోసారి లోక్‌సభ స్పీకర్‌ రేసులో గత స్పీకర్ ఓం బిర్లానే ఉన్నారనే బీజేపీ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచిన ఓం బిర్లానే.. ఈసారి కూడా స్పీకర్ పదవిలో కూర్చొబెట్టాలని బీజేపీ హై కమాండ్ యోచిస్తున్నట్లు కమలం శ్రేణులు ముచ్చటించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. జూన్‌ 27 వ తేదీ నుంచి జూలై 3 వ తేదీ వరకు రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com