ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి త్వరలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ రైళ్లు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 09:52 PM

గత కొన్నేళ్లలో భారతీయ రైల్వేల్లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో రైల్వే స్టేషన్లతోపాటు అత్యాధునిక రైళ్లతో ఇండియన్ రైల్వే రూపురేఖలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పట్టాలెక్కిన వందే భారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులు లేకపోగా.. అతి త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. ఏ రోజు ప్రారంభం కానున్నాయో తేదీతో సహా వెల్లడించారు. ఇక బుల్లెట్ రైలు కూడా మన దేశంలో పరిగెత్తే రోజు దగ్గర్లోనే ఉంది.


మరో 60 రోజుల్లోనే దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి పట్టాలపై వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెడతాయని చెప్పారు. ఈ క్రమంలోనే పట్టాలపై పరుగులు తీయడానికి వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధంగా ఉందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే ఈ వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం రెండు ప్రత్యేక ట్రాక్‌లను సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ రెండు ట్రాక్‌లపై ట్రయల్స్ పూర్తైన తర్వాత ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులో వస్తాయని తెలిపారు.


అయితే ప్రయోగ దశలో ఈ వందే భారత్ రైలుకు నాలుగు స్లీపర్ క్లాస్ కోచ్‌లతో నడిపించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత స్లీపర్ కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. ఇక వచ్చే ఐదేళ్లలో సుమారు 400 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో వందే భారత్ రైళ్లు ఎక్కేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు మాత్రమే అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను కూడా పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.


వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గత కొంతకాలంగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు సంబంధించి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయనుందన్నారు. ఇక వెయిటింగ్ లిస్ట్ సిస్టమ్‌కు పరిష్కారం కోసం రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైళ్లు, బెర్తుల సంఖ్యను పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com