ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల్ని ఏపీకి పంపండి.. కేంద్రానికి చంద్రబాబు సర్కార్ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 08:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు పాలనలో దూకుడు పెంచారు. రెండు రోజులుగా ఆయన పాలనాపరమైన పనుల్లో బిజీ అయ్యారు. అయితే ఇద్దరు ఐఏఎస్ అధికారుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎంవోలోకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్‌లు ఏవీ రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏవీ రాజమౌళి 2003 బ్యాచ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. 2014 టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంవోలో కీలకంగా పనిచేశారు. రాజమౌళిప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌స్టేట్‌ క్యాడర్‌ డిప్యుటేషన్‌పై ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. కార్తికేయ మిశ్రా 2009 ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.. ఆయన ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను రిలీవ్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే బాధ్యతల్ని కూడా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవిచంద్ర 1996 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన ప్రభుత్వంలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు.. 2014లో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రవిచంద్ర నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్‌గా సేవలందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com