ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే ఎన్నడూలేని రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత.. ఢిల్లీలో 52.3 డిగ్రీలు నమోదు

national |  Suryaa Desk  | Published : Wed, May 29, 2024, 09:53 PM

ఈసారి వేసవి కాలంలో భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే జనం తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తీవ్ర సంచలనంగా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఢిల్లీలోని ప్రజలు ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుండటంతో మరోవైపు.. కరెంటు వినియోగం భారీగా పెరుగుతోంది. ఇక అదే సమయంలో ఢిల్లీలో పలు చోట్ల వర్షం కూడా పడింది. అయితే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌ కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.


ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో ఉన్న వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలోనే ఎండలు, వేడి గాలులు తట్టుకోలేక.. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరగడంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. బుధవారం ఏకంగా ఢిల్లీలో విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది.


మరోవైపు.. ఢిల్లీలో రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఇక ఢిల్లీలో గతంలో 2002 లో 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఇవాళ నమోదైన ఉష్ణోగ్రత దాన్ని అధిగమించిందని భారత వాతావరణ శాఖ రీజినల్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. రాజస్థాన్‌ నుంచి వీచే బలమైన వేడి గాలుల కారణంగా ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇక సాధారణం కంటే 9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.


ఇక ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఫలోడిలో 51 డిగ్రీలు, 50.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలుల కారణంగా దక్షిణ రాజస్థాన్‌లోని బార్మర్, జోధ్‌పూర్, ఉదయపూర్, సిరోహి, జలోర్ వంటి ప్రాంతాల్లో బుధవారం 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


భారీ ఉష్ణోగ్రతల కారణంగా బుధవారం దేశంలోని వాయువ్య ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. వేడిగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. బుధవారం నుంచి ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో వేడిగాలులు, అత్యంత వేడిగాలుల పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముంగేశ్‌పూర్‌, నరేలా ప్రాంతాల్లో మంగళవారం 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com