ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హింసాత్మక ఘటనలపై నివేదిక సమర్పించిన సిట్.. అందరిలో అదే టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 06:58 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 సందర్భంగా చెలరేగిన హింస, అల్లర్ల ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్.. డీజీపీకి నివేదిక సమర్పించింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఏపీలో పోలింగ్ రోజు, మరుసటి రోజు హింస చెలరేగిన ప్రాంతాలలో రెండురోజుల పాటు పర్యటించిన సిట్ అధికారులు.. దర్యాప్తునకు సంబంధించి 150 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను డీజీపీకి సమర్పించారు. మే 13, 14వ తేదీల్లో పల్నాడు జిల్లా, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ రెండురోజుల్లో ఆయా ప్రాంతాలను సందర్శించిన సిట్.. నివేదికను తయారుచేసింది. మొత్తం 33 చోట్ల ఘర్షణలు జరిగినట్లు సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.


ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. అయితే మే13వ తేదీతో పాటుగా.. ఆ మరుసటిరోజు కూడా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పల్నాడ, మాచర్ల, తాడిపత్రి, నర్సరావుపేట, చంద్రగిరి వంటిచోట్ల వైసీపీ , టీడీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. దీనిపై సిట్ ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రెండురోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.


ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం రెండురోజుల క్రితం సిట్ ఏర్పాటు చేయగా.. ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలలో ఈ రెండురోజులు పర్యటించిన సిట్ అధికారులు.. కీలక సమాచారాన్ని సేకరించారు. స్థానికులు, పోలీసులను విచారించి ఘర్షణల వెనుకున్న అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అల్లర్లపై నమోదైన కేసులను పరిశీలించారు. ఘటనలు జరిగిన ప్రదేశాలను కూడా పరిశీలించి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. ఈ నివేదికను ఏపీ డీజీపీకి సిట్ అధికారులు సమర్పించారు. ఏపీ డీజీపీ ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి అందజేయనున్నారు. మరోవైపు హింసాత్మక ఘటనలకు సంబంధించి మరిన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదుచేయాలని సిట్ సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు రాజకీయ నేతల అరెస్టులపైనా సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ సమర్పించిన నివేదికలో ఏముంది.. ఎవరి పేర్లు ఉండనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com