ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంతకు తెగించార్రా.. ఎన్నికల సంఘాన్ని వదల్లేదుగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 06:54 PM

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు దాటిపోయింది. మే 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. అయితే ఓటింగ్ ముగిసిన నాటి నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ గెలుస్తోందని కొన్ని.. లేదు టీడీపీ కూటమి గెలుస్తోందని మరికొన్ని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు మీడియా సంస్థల లోగోలను ఎడిట్ చేసి మరీ.. ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కులాల వారీగా ఓటర్ల వివరాలు అంటూ ఓ పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏపీలో కులాల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించిందంటూ ఓ పోస్టు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతోంది. అయితే దీనిపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్‌లో కులాలవారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించిందంటూ వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఎన్నికల సంఘం కులాలవారీగా ఓటర్ల వివరాలు విడుదల చేయలేదని ఏపీసీఈవో తన ట్వీట్లో స్ఫష్టం చేశారు. ఇదంతా అబద్ధపు ప్రచారమని తేల్చారు. ఫ్యాక్ట్ చెకింగ్ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సమచారం తప్పని తేలిందని ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇదంతా కల్పితమని స్పష్టం చేశారు. నిజాలను, వాస్తవాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకుందామని.. ఇలాంటి అబద్ధాలను కాదంటూ ఏపీసీఈవో కార్యాలయం తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.


వైరల్ అవుతున్న పోస్టులో ఏయే సామాజిక వర్గాల ఓటర్లు ఎంతమంది ఉన్నారనే వివరాలు రాసుకొచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఈ వివరాలు ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసి తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి రాజకీయ నేతల ర్యాలీల వరకూ ప్రతి అంశాన్ని తప్పుదోవ పట్టిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘం పేరునే వాడుకుంటూ ఫేక్ ప్రచారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఇలాంటివి ఇంకెన్ని ఫేక్ ప్రచారాలు వస్తాయో చూడాలి మరి. అదేవిధంగా సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అయ్యే ప్రతి విషయం నిజమని అనుకోకుండా.. నిజనిర్ధారణ చేసుకోవాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com