ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఎన్నికల ఫలితాలపై మళ్లీ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 07:13 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్ ముగిసింది.. జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ మొదలైంది.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతుంటే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్‌సీపీ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 151కిపైగా ఎమ్మెల్యేసీట్లు.. 22 వరకు ఎంపీ సీట్లు ఖాయమన్నారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ నేతలు ఏకంగా జూన్ 9న సీఎం జగన్ రెండోసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. అయితే జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టాపిక్ తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు.


సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత మరోసారి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్లు సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ కూడా చెబుతున్నారన్నారు. తాను గత పదేళ్లు ఎన్నికల్లో పనిచేస్తున్నానని.. తనకు ఫలితాల ముందే ఓటమిని అంగీకరించినవారు ఎవరూ కనిపించలేదని వ్యాఖ్యానించారు.


జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు పూర్తైన తర్వాత కూడా కచ్చితంగా చూడండి.. వచ్చే రౌండ్లలో తమకు మెజార్టీ ఖాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ధీమాను వ్యక్తం చేస్తారని చెప్పుకొచ్చారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారని.. జగన్ మాత్రం అలా కాకుండా గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఈ గెలుపు ఓటములపై చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గతం కంటే సీట్లు తగ్గవని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, బీజేపీలపై అసంతృప్తి మాత్రమే ఉందని.. ఆగ్రహం లేదన్నారు. అందుకే ఈసారి బీజేపీ 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ.. అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికలకు ముందు వరకు ఐప్యాక్ సంస్థ తరఫున వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com