ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయ యాత్ర చేయనున్నారు. ఆలూరులో ఉదయం పది గంటలకు ఆమె కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆరు గంటలకు ఎమ్మిగనూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం షర్మిల కడపకు బయలుదేరి వెళతారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. బాబురావు షర్మిలా పాదయాత్ర వివరాలు వెల్లడించారు. గురువారం రాత్రి ఆలూరులో బస చేశాక 19న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆలూరులో సమావేశం ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు ఆదోని బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకు ఎమ్మిగనూరులో బహిరంగ సభ అనంతరం కడప బయలు దేరి వెళ్తారన్నారు. ఈనెల 20న కడపలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారని, అదేరోజు సాయంత్రం 6 గంట లకు కోడుమూరులో కోట్ల సర్కిల్లో బహిరంగ సభ, అనంతరం అక్కడి నుంచి బయలు దేరి కర్నూలు చేరుకుంటారన్నారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలో యాత్ర ప్రారంభమై బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్, శ్రీరామ్ టాకీస్, ఐదురోడ్ల కూడలి, వైఎస్ఆర్ సర్కిల్, గౌసియా హాస్పిటల్, కొండరెడ్డి బురుజు, పాతబస్టాండ్, కింగ్ మార్కెట్, గడియారం హాస్పిటల్, చౌక్లో మీటింగ్, వన్టౌన్ పోలీస్టేషన్, జమ్మిచెట్టు, జోహరాపురం, వెంకాయపల్లి, గార్గేయపురం మీదుగా నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తారని పేర్కొన్నారు.