ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్యాయంగా విడదీస్తారా సార్.. అప్లై చేసుకున్న జంటకు కాకుండా మరో జంటకు విడాకులు

international |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 09:01 PM

భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినపుడు ముందు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. రకరకాల కౌన్సిలింగ్‌లు కూడా తీసుకుంటారు. ఇక అవేమీ వారి మధ్య సంబంధాలను మెరుగుపరచకపోతే చివరికి విడాకులు తీసుకుంటారు. అయితే విడాకుల కోసం అప్లై చేసుకోగానే.. వెంటనే మంజూరు కావు. వాటికి నిర్ణీత సమయం ఉంటుంది. అయితే ఇలా విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని వేచి చూసేవారు చాలా మంది పెండింగ్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలోనే కంప్యూటర్‌లో జరిగిన టెక్నికల్ సమస్య కారణంగా దరఖాస్తు చేసుకున్న జంటకు కాకుండా మరో జంటకు విడాకులు మంజూరైన ఘటన ప్రస్తుతం సంచలంగా మారింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత తప్పిదాన్ని గుర్తించారు. ఈ సంఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.


బ్రిటన్‌కు చెందిన విలియమ్స్ అనే మహిళ.. తన భర్తతో విడాకులు కావాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. విడాకుల కోసం వార్దాగ్స్ అనే సంస్థను ఆమె ఆశ్రయించారు. భర్తతో విడిపోయిన విలియమ్స్.. గతేడాది నుంచి ఆయనకు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే విలియమ్స్ దంపతులకు సంబంధించిన వాదనలు కోర్టులో జరుగుతున్నాయి. ఇక వార్దాగ్స్ లా కంపెనీ వద్ద ఇలాంటి విడాకుల కేసులు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. వారికి సంబంధించిన వాదనలు మొత్తం పూర్తయ్యాయి.


ఇక చివరగా వారికి విడాకులు మంజూరు చేయడమే మిగిలి ఉన్న తరుణంలో వారి పేర్ల స్థానంలో ఈ విలియమ్స్ దంపతుల పేర్లు చేర్చబడ్డాయి. అయితే వార్దాగ్ సంస్థ నుంచి ఆ రెండు జంటలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. వారికి బదులు ఆ స్థానంలో వీరి పేర్లు కంప్యూటర్‌లో రావడంతో కోర్టుకు చేరాయి. అయితే ఆ విషయాన్ని సదరు వార్దాగ్ సంస్థ కూడా గుర్తించకపోవడంతో నేరుగా ఆ పత్రాలు జడ్జి వద్దకు చేరాయి. అన్ని వివరాలు పరిశీలించిన జడ్జి 21 నిమిషాల్లోనే వారికి విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత జరిగిన ఘోర తప్పిదాన్ని వార్దాగ్ సంస్థ గుర్తించింది. వెంటనే దాన్ని సరిదిద్దుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నించి కోర్టును ఆశ్రయించింది. తాము గతంలో అందించిన పత్రాల్లో పొరపాటు జరిగిందని.. ఒక జంట పేర్లకు బదులు మరో జంటకు సంబంధించిన పేర్లు కంప్యూటర్‌లో తప్పుగా రావడంతో అలాగే అందించినట్లు కోర్టుకు తెలిపింది. వెంటనే ఆ విడాకులను రద్దు చేయాలని కోరుతూ విలియమ్స్‌ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే వారు చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించలేదు.


ఈ ఘటనపై సదరు వార్దాగ్స్‌ సంస్థ ఫౌండర్ అయేషా వార్దాగ్ స్పందించారు. ఇది చాలా తప్పుడు నిర్ణయమని.. కొందరు చేసిన తప్పిదాల ఆధారంగా విడాకులు మంజూరు చేయకూడదని పేర్కొన్నారు. విడాకులు తీసుకునే వ్యక్తుల అభిప్రాయాలు, అంగీకారాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాంటప్పుడే న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు. టెక్నికల్ సమస్య తలెత్తిందని గుర్తించి దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com