ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు.. జైలు నుంచి ఢిల్లీ సీఎం మెసేజ్

national |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 08:45 PM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అక్కడి నుంచే ఢిల్లీ ప్రభుత్వ పాలనను చూస్తున్నారు. జైలులో నుంచే ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు కూడా పలు సందేశాలు పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ పంపించిన సందేశాలను ఇప్పటివరకు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియాకు వినిపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఒక సందేశాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో గత కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయి తీహార్ జైలుకు వెళ్లిన సంజయ్ సింగ్.. ఇటీవలె విడుదల కావడం గమనార్హం.


తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ పంపించిన మెసేజ్‌ను ఎంపీ సంజయ్‌ సింగ్‌ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అందులో కేజ్రీవాల్.. తన పేరు అరవింద్‌ కేజ్రీవాల్‌ అని.. తాను ఉగ్రవాదిని కాదు అని సందేశాన్ని పంపినట్లు సంజయ్ సింగ్ తెలిపారు. దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం ఒక కుమారుడు, సోదరుడిలాగా పనిచేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలాంటి సందేశాన్ని పంపించారని ఎంపీ వెల్లడించారు. వరుసగా 3 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌.. అద్దం వెనుక నుంచి కలిశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎంత ద్వేష భావంతో ఉన్నారో దీన్ని బట్టే అర్థం అవుతోందని సంజయ్‌ సింగ్‌ అన్నారు.


ఇక తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఒక ఉగ్రవాదిలా పరిగణిస్తున్నారని సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సైతం కేజ్రీవాల్‌తో ములాఖత్ అయ్యే సమయంలో వారిద్దరి మధ్య అద్దాన్ని ఉంచారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేతను నిరుత్సాహపరిచేందుకు 24 గంటలు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్‌ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని సంజయ్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను ఎంత విచ్ఛిన్నం చేస్తే అంతే బలంగా పైకి లేస్తారని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.


మరోవైపు.. జైలు నుంచి కేజ్రీవాల్ పంపించిన ఈ సందేశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్‌ను గానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను గానీ ఉగ్రవాదులు అని ఎవరూ అనడం లేదని కేవలం అవినీతిపరులు అని మాత్రమే అంటున్నామని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కౌంటర్ ఇచ్చారు. వృద్ధులను పెన్షన్ల కోసం.. పేదలను రేషన్ కార్డుల కోసం కేజ్రీవాల్ ఏడిపించారని మండిపడ్డారు. స్వచ్ఛమైన నీరు, గాలి కోసం ఢిల్లీ ప్రజలను ఆప్ ప్రభుత్వం ఏడిపించిందని తీవ్ర ఆరోపణలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com