ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిత్ షా ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైళ్లు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 08:31 PM

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం హోం శాఖ ఆఫీస్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కార్యాలయంలోని కంప్యూటర్లు, పత్రాలు, ఫైళ్లు, జిరాక్స్ మిషన్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదైనట్లు గుర్తించారు.


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు వివరించారు. నార్త్‌ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.


అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 7 ఫైర్‌ ఇంజన్ల సాయంతో ఎగిసిపడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో జిరాక్స్‌ మెషిన్‌‌, కొన్ని కంప్యూటర్లు, మరికొన్న పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భవనంలో లేరని.. పలువురు సీనియర్‌ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆఫీస్‌లో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com