ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొత్తు ఏపీలో.. ప్రచారం తమిళనాడులో.. ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 06:58 PM

ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక పార్టీల అధినేతలు అందరూ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. అయితే తమ అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేయాల్సిన నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. పొరుగు రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొంది.


ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎన్డీయే కూటమిగా వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఎన్నికల కోసం ఏపీలో ప్రచారం చేయాల్సిన కూటమి నేతలు.. పొత్తుల కారణంగా పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందర్‌రాజన్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. చెన్నై దక్షిణం నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా తమిళిసై బరిలో ఉన్నారు.


అయితే చెన్నై సౌత్‌లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువ. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఓటర్ల మదిని గెలుచుకునేందుకు బీజేపీ తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. తమిళిసైకి మద్దతుగా చెన్నై సౌత్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. అలాగే బహిరంగసభలోనూ పాల్గొంటారు. ఇప్పటికే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజాగా తమిళిసై సౌందర్‌రాజన్.. తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు.


ఏపీలో కుదిరిన పొత్తు కారణంగా ఏపీలోని కూటమి నేతలు తమిళనాడులో ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే కమలం పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏ మేరకు పనిచేస్తుంది.. తమిళనాడులో సెటిలైన తెలుగువారి మది గెలుచుకోవటంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com