ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వాసుదేవరెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్ల పేర్లతో జాబితా ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియను మంగళవారం రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అయితే టీడీపీ నేతల ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ శ్రేణులు భారీగా మద్యాన్ని నిల్వ చేసుకుంటున్నాయని బేవరేజెస్ కార్పొరేషన్, అధికారులు ఇందుకు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలంటూ తన ఫిర్యాదులో అచ్చెన్న కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓసారి పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. తాజాగా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని సైతం బదిలీ చేసింది. ఇదే సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ మంగళవారం కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహా రావు, టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈసీని కలిసిన వారిలో ఉన్నారు.