ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేడ్కర్‌ ఆశయాలను నిలబెట్టడం అంటే మద్యం అమ్మడమా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 03:47 PM

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ మీద పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా ఆగ్రహించారు. కార్వేటినగరం, పలమనేరు, బంగారుపాళ్యంలలో ఆమె పర్యటన సాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై, ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘జగన్‌తో పాటు నారాయణస్వామికి ఓట్లేసి గెలిపించారు. ఆయన డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ మినిస్టర్‌ అంట కదా.. అంటే ఏమిటో తెలుసా.. లిక్కర్‌ బాటిల్‌ మంత్రి. లిక్కర్‌ షాపుల్లో భూం భూం, స్పెషల్‌ స్టేటస్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌ అన్నీ ఈయనవే అంట కదా. బాగా సంపాదించారు. దళితుడు. అంబేడ్కర్‌ శిష్యుడ్ని అని చెప్పుకుంటాడు కదా. అంబేడ్కర్‌ ఆశయాలను నిలబెట్టడం అంటే మద్యం అమ్మడమా.. అది కూడా కల్తీ మద్యం అమ్మడమా.. నాసిరకం మందుతో మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ మండి కిడ్నీలు, లివర్లు చెడిపోయి చనిపోతున్నారు. అయినా అవే నాసిరకం మద్యం అమ్మకాలు. బయట క్వార్టర్‌ బాటిల్‌ రూ.60 అయితే, మన వద్ద రూ.250 అమ్ముతున్నారు. నిజమేనా?’ అని జనాన్ని అడిగారు. వారి నుంచి సమాధానాలు రాబట్టారు.అలానే పలమనేరు సభలో మాట్లాడుతూ... ‘మీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పరిపాలన ఎలా ఉంది? ఎప్పుడైనా వస్తున్నారా? సమస్యల్ని పరిష్కరిస్తున్నారా? మీరు ఓటేసి గెలిపిస్తే నెత్తి మీద టోపీ పెట్టారు. ఇసుక, మట్టి మాఫియాతో బాగా సంపాదించారు. నదిలో ఇసుక లేకుండా మొత్తం అమ్ముకున్నాడట కదా. మరోసారి ఓటేస్తే మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు. నియోజకవర్గంలోని భూముల్ని, ప్రజల్ని మొత్తంగా అమ్మేస్తాడు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com