ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్రపట్టకపోతే ఓ పెగ్ వేసుకోని పడుకోండి.. మహిళా మంత్రిపై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:37 PM

లోక్‌సభ ఎన్నికల వేళ మహిళా మంత్రిని ఉద్దేశించి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర దుమారం రేగుతోంది. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్‌పై మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ నోరుజారారు. బెలగావి లోక్‌సభ స్థానం నుంచి మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాల్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తుండగా.. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ ఓ సభలో మాట్లాడుతూ.. బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతుండటంతో మంత్రి హెబ్బాల్కర్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆమెకు నిద్ర సరిగ్గా పట్టడం లేదని, అందుకు నిద్రమాత్రలు లేదా ఓ పెగ్ వేసుకోవాలని వ్యంగ్యంగా అన్నారు.


‘బెలగావీలో బీజేపీకి పెరుగుతున్న మహిళల మద్దతుచూసి మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్‌కు సరిగ్గా నిద్రపట్టడం లేదు.. రమేశ్ జార్ఖిహోళి ప్రచారం చేయడం కూడా కష్టమే.. మంచిగా నిద్రపట్టాలంటే ఆమె నిద్రమాత్ర లేదా ఎక్స్‌ట్రా పెగ్ వేసుకోవాల్సిందే’ అని ఎద్దేవా చేశారు. రమేశ్ జార్ఖిహోళి 2021లో సెక్స్ టేపులో కుంభకోణం కర్ణాటకను కుదిపేసిన విషయం తెలిసిందే.


మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ‘ఇది మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం.. బీజేపీ రహస్య అజెండా ఇదే.. మీరు శ్రీరామ్, బేటీ పచావో, బేటీ పఢావో అని జపిస్తే సరిపోదు.. మీరు స్త్రీలను గౌరవించాలి..అది మన హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతి గురించి ప్రసంగాలు చేసే సంజయ్ పాటిల్ వ్యాఖ్యలు నన్నే కాదు రాష్ట్రం, దేశంలోని మహిళలందరినీ కించపరచడమే’ అని ఆమె కౌంటర్ ఇచ్చారు.


ఇక, ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిపై మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్ విమర్శలు గుప్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ టిక్కెట్ నిరాకరిస్తే.. కాంగ్రెస్ ఆదరించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి సముచిత స్థానం కల్పించందని గుర్తుచేశారు. కొద్ది నెలల కిందటే షెట్టర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ‘హుబ్బళ్లికి చెందిన జగదీశ్ షెట్టర్ స్థానికేతరుడు.. మేము స్థానికులం.. స్థానికేతరుల కంటే మాకే ఇక్కడ సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుంది.. ప్రధాని నరేంద్ర మోదీని దృష్టిలో ఉంచుకుని షెట్టర్‌కు ఓటేయాలని బీజేపీ నేతలు అంటున్నారు.. కానీ, ఆయన కాంగ్రెస్‌లో చేరి బీజేపీ, ప్రధాని మోదీ, మాజీ సీఎం బీఎస్ యడియూరప్పలను ఎందుకు దుర్భాషలాడారో తనకు తెలుసుకోవాలని ఉంది’ అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com