ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు.. అమెరికాలో ప్లాన్ చేసిన గ్యాంగ్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:31 PM

ముంబయిలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నివాసం వద్ద ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆగంతకులు కాల్పులు జరిపి పరారయ్యారు. హెల్మెట్లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బాంద్రాలో ఆయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ బయట గాల్లోకి నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ క్రమంలో ఓ బుల్లెట్‌ సల్మాన్‌ ఇంటి బాల్కనీలో పడింది. కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్‌ ఇంట్లోనే ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. దుండగులు వాడిన బైక్‌ను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల్లో ఒకర్ని గుర్తించారు.


ఈ కాల్పుల జరిపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కాల్పులకు అమెరికాలో వ్యూహరచన చేశారని, ప్రొఫెషనల్ షూటర్‌ల నెట్‌వర్క్ సాయంతో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఆయుధాలను సేకరించారని గుర్తించారు. బైక్‌పై వచ్చిన నిందితుల్లో ఒకడు తెలుపు రంగు, ఇంకొకడు ఎరుపు రంగు టీ షర్టులు, డెనిమ్ జీన్స్ వేసుకున్నారు.


పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, కర్నిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి సహా పలు కీలక హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులకు అమెరికాలో ఉంటోన్న అతడి సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. మరో గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారాకు షూటర్‌లను ఎంపిక చేసే పనిని అప్పగించాడు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రొఫెషనల్ షూటర్ల నెట్‌వర్క్ ఇందులో పాల్గొందని పోలీసులు తెలిపారు.


ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ అన్మోల్ బిష్ణోయ్ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేశాయి. అయితే, ఈ ఫేస్‌బుక్ పేజీ ఐపీ అడ్రస్ కెనడాలో ఉండగా... పోస్ట్‌ను పెట్టడానికి వీపీఎన్‌ని ఉపయోగించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో గోదారా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజస్థాన్‌లో రాజు తేథ్ హత్య సహా పలు హైప్రొఫైల్ హత్య కేసుల్లో ఇతడి ప్రమేయం ఉంది.


బిష్ణోయ్ ముఠా అనేక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఆయుధాలను సిద్ధంగా ఉంచుతుందని పోలీసులు తెలిపారు. గోదారా భారత్‌లోని తన సహచరుల ద్వారా షూటర్లకు ఆయుధాలు సమకూర్చిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌లో కాలుగా గుర్తింపు పొందిన విశాల్ మరో కీలక సభ్యుడు. సల్మాన్ నివాసం వద్దకు వచ్చిన ఇద్దరిలో ఒకడు అతడే. గతేడాది మార్చిలో జరిగిన గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారవేత్త సచిన్ ముంజాల్‌ హత్య కేసులో విశాల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గోదారా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ముంజాల్ హత్యను అంగీకరించినట్లు సమాచారం.


విశాల్, మరో అనుమానితుడు సల్మాన్ ఖాన్ నివాసానికి వచ్చేందుకు రాయ్‌గడ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారు. పన్వేల్ నుంచి ఆ బైక్‌పై ముంబయికి చేరుకున్నారు. ఈ బైక్‌ విక్రయించిన వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ ఇంటి వెలుపల సాధారణంగా ఉండే పోలీసు వాహనం ఆదివారం ఉదయం కనిపించలేదని వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్‌కు చెందిన ఐదు రాష్ట్రాల పోలీసులు వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇక, ఈ కాల్పులు తామే జరిపామని అన్మోల్‌ బిష్ణోయ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది ట్రైలర్‌ మాత్రమేనని వ్యాఖ్యానించాడు. ఇదే చివరి హెచ్చరిక అని, ఈసారి కాల్పులు ఇంటి బయట మాత్రమే జరగబోవని అతడు హెచ్చరించారు. సల్మాన్‌ఖాన్‌కు ఇప్పటికే పలుమార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గతేడాది మార్చిలోనూ ఆయనకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు వచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com