ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరామనవమికి అయోధ్యకు 40 లక్షల మంది భక్తులు.. ఆలయ ట్రస్ట్ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 09:05 PM

500 ఏళ్ల తర్వాత తొలిసారి అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయోధ్య రామ మందిరం నిర్మించిన తర్వాత తొలిసారి జరుగుతున్న శ్రీరాముడి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అయోధ్య ప్రారంభోత్సవం తర్వాత జరుగుతున్న మొదటి శ్రీరామనవమి కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలిరానున్నారు. దాదాపు 40 లక్షల మంది భక్తులు ఈ నెల 17 వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకు చేరుకుంటారని ట్రస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వేడుకల కోసం అయోధ్య నగరం మొత్తం ముస్తాబు అవుతోంది.


శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో రామ భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆ రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో అయోధ్య బాలరాముడి దర్శన సమయాన్ని మరింత పెంచనున్నారు. ఈ నెల 16, 17, 18 వ తేదీల్లో 3 రోజుల పాటు దర్శన సమయాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ 3 రోజుల పాటు రోజులో 20 గంటల పాటు భక్తులు.. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్‌ అధికారులు ఏడు వరుసల్లో భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.


భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు రామ్‌లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. 4 రోజుల పాటు వీఐపీ దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని ట్రస్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఏప్రిల్ 15 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు జారీ చేసిన వీఐపీ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చైత్ర శుక్ల సప్తమి అంటే సోమవారం నుంచి అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో వీఐపీ దర్శనాలకు బ్రేక్‌ పడింది.


ఇక అయోధ్య నగరం మొత్తం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమాన్‌గర్హి టెంపుల్‌ జోన్‌, కనక్‌ భవన్‌ టెంపుల్‌ జోన్‌, నయా ఘాట్‌ జోన్‌, నాగేశ్వరనాథ్‌ జోన్‌ సహా అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 3 రోజులు 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అధికారులు మూడు షిఫ్టుల్లో పని చేయనున్నారు. పోలీస్, హెల్త్, మున్సిపల్‌ కార్పొరేషన్‌, విద్యుత్‌ శాఖ అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఇక అయోధ్య నగరంలో అడుగడుగునా సీసీటీవీలు ఏర్పాటు చేసి.. నిఘా నీడలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com