ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాతలకు గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. దేశంలో ఈ ఏడాది వానలే వానలు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 09:04 PM

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. గతంలో కన్నా ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది సమయానికి రుతుపవనాల ఆగమనం ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించగా.. తాజాగా మరో శుభవార్త తెలిపారు. ఈ ఏడాది వర్షా కాలంలో విరివిగా వర్షాలు పడతాయని పేర్కొన్నారు. సాధారణం కన్నా ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదయ్యా అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఎండ తాపానికి అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పినట్లయింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.


ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య భారీగా వర్షాలు పడతాయని పేర్కొన్నారు. దీర్ఘకాల సగటు-ఎల్‌పీఏ 87 సెంటీమీటర్లతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లోని 4 నెలల్లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చనే అభిప్రాయాన్ని ఐఎండీ అధికారులు వ్యక్తం చేశారు. లా నినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ అధిపతి మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.


1951 నుంచి 2023 వరకు ఉన్న సమాచారం ప్రకారం లానినా, ఎల్‌నినో సంఘటనలను అనుసరించి భారత్‌లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఇక గత 4 ఏళ్ల రుతుపవనాల సీజన్‌లో సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఈసారి వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక జులై నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని.. వాటితో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ వర్షాపాతంపై సానుకూలంగా చేసిన ప్రకటనతో అన్నదాతలకే కాకుండా సాధారణ ప్రజలకు గొప్ప ఊరటనిస్తుంది. ఇక రానున్న 4 రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 17 నుంచి 2 -3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశముందని తెలిపింది. ఇక ఈనెల 19 నుంచి 20 మధ్య రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పలుచోట్ల నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com