ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాటల తూటాలు పేలుస్తునే ఉన్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై, ఉద్యోగాల భర్తీపై ఎప్పకటిప్పుడు జగన్ను షర్మిల విమర్శిస్తూనే ఉన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారన్నారు. ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు చేసిన మోసం చాలదని... జాబు రావాలంటే జగన్ కావాలని ఘరానా మోసానికి తెరలేపారంటూ మండిపడ్డారు. ‘‘జగన్ మోహన్ రెడ్డి గారు.. 2.32లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, 23వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మీరు... 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని.. జంబో డీఎస్సీ అని..ఏపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని అన్నారు. ‘‘- మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం తప్ప.. గౌరవంగా చెప్పుకొనే ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా?’’ అని నిలదీశారు. నేటికీ శాఖల పరిధిలో 2.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యలు చేశారు.