ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్వెస్టర్లను నిండా ముంచిన రిలయన్స్, LIC, ఎస్‌బీఐ షేర్లు.. వారంలోనే రూ. 2 లక్షల కోట్ల లాస్.. ఇలా అయిందేంటి

business |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 11:21 PM

స్టాక్ మార్కెట్లలో చాలా వరకు చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు ఇటీవలి కాలంలో బుడగల్లా పెరుగుతూ వస్తున్నాయని.. ఇది అసలే సహేతుకంగా అనిపించట్లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్ కొద్దిరోజుల కింద మాట్లాడారు. దీంతో స్టాక్ మార్కెట్లు గత వారం కరెక్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. మరోవైపు అంతకుముందు స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్టాలకు చేరిన క్రమంలోనే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) పాల్పడ్డారు. దీంతో పలు హెవీవెయిట్ షేర్లు కిందటి వారం భారీగా పతనమయ్యాయి. ఒక్క వారం వ్యవధిలోనే ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్ విలువ పరంగా భారత్‌లోని టాప్ 10 కంపెనీల్లో 5 కంపెనీల మార్కెట్ విలువనే ఏకంగా రూ. 2.23 లక్షల కోట్లు పతనమైంది.


వీటిల్లో ఎక్కువగా భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. కిందటి వారం BSE బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 1.99 శాతం లేదా 1475.96 పాయింట్లు పడిపోయింది. టాప్-10 కంపెనీల్లో నష్టపోయిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా హిందుస్థాన్ యూనీలివర్ ఉన్నాయి. ఇదే సమయంలో మార్కెట్లు పతనమైనా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ లాభపడ్డాయి.


>> రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే అత్యధికంగా వారం వ్యవధిలో రూ. 81,763.35 కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది. అంటే ఇన్వెస్టర్లు దీంట్లో పెట్టుబడులు పెట్టి ఇంత మొత్తం నష్టపోయారన్నమాట. ప్రస్తుతం RIL ఎంక్యాప్ రూ. 19.19 లక్షల కోట్లకు చేరింది.


>> ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 63 వేల కోట్లు తగ్గి.. రూ. 5.84 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఇక ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 50 వేల కోట్లు పతనమై ప్రస్తుతం రూ. 6.53 లక్షల కోట్లకు చేరింది. హిందుస్థాన్ యూనీలివర్ M-cap రూ. 21 వేల కోట్లు పడిపోయి రూ. 5.46 లక్షల కోట్లకు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 6 వేల కోట్లు తగ్గి రూ. 7.57 కోట్లకు చేరింది.


>> వీటికి భిన్నంగా టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 38 వేల కోట్లు పెరిగి రూ. 15.25 లక్షల కోట్లకు ఎంక్యాప్ చేరింది. భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ. 11 వేల కోట్లు ఎగబాకి రూ. 6.89 లక్షల కోట్లకు చేరింది. ఐటీసీ మార్కెట్ విలువ రూ. 7 వేల కోట్లు పెరిగి రూ. 5.23 లక్షల కోట్లకు చేరింది. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 4 వేల కోట్లు ఎగబాకి రూ. 11.03 లక్షల కోట్లకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com