ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ 57 వేల డాలర్ల మార్క్ తాకిన బిట్‌కాయిన్.. రెండేళ్ల తర్వాత తొలిసారి

business |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 10:51 PM

ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పుంజుకుంటోంది. తాజా ర్యాలీతో రెండేళ్ల గరిష్ఠాన్ని తాకింది. 2021 తర్వాత తొలిసారి 57 వేల డాలర్ల స్థాయిని తాకింది. ఆ తర్వాత కాస్త తగ్గి ప్రస్తుతం 56 వేల ఎగువన ట్రేడింగ్ అవుతోంది. మరో క్రిప్టో కరెన్సీ ఎథీరియం సైతం 3200 మార్క్ ఎగువన కొనసాగుతోంది. 2022 తర్వాత ఈ క్రిప్టోకు ఇదే గరిష్ఠ కావడం గమనార్హం. అయితే, క్రిప్టో కరెన్సీలు, ముఖ్యంగా బిట్ కాయిన్ ఇంతలా పెరిగేందుకు గల కారణాలేంటి? ఓసారి పరిశీలిద్దాం.


అమెరికాకు చెందిన ప్రముఖ క్రిప్టో ఇన్వెస్టర్, సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రో స్ట్రాటజీ.. ఇటీవల 155 మిలియన్ డాలర్లు వెచ్చించి 3 వేల బిట్ కాయిన్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి తోడు బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు అమెరికా ఆమోదం తెలపడం కూడా క్రిప్టో కరెన్సీలు రాణించేందుకు మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే బిట్ కాయిన్ లో చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్లు వెల్లువెత్తున్నట్లు పేర్కొంటున్నాయి.


2021 లో క్రిప్టో కరెన్సీలుగా పరుగులు పెట్టాయి. ఆ ఏడాది జీవన కాల గరిష్ఠాలను అందుకున్నాయి. బిట్ కాయిన్ ఓ దశలో 60 వేల డాలర్ల మార్క్ కూడా దాటడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా వీటిల్లో పెట్టుబడులు పెట్టే వారు భారీగా పెరిగారు. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల క్రిప్టో కరెన్సీల విలువలు భారీగా పడిపోయాయి. ఒక దశలో భారీగా కుప్పకూలాయని చెప్పవచ్చు. దీంతో చాలా మంది కోట్లాది రూపాయలు నష్టపోయారు. చాలా రోజుల పాటు క్రిప్టో కరెన్సీలు కనిష్ఠ స్థాయిల్లో కొనసాగాయి. ముఖ్యంగా బిట్ కాయిన్ 20 వేల డాలర్ల స్థాయిలోనే ట్రేడింగ్ జరిపింది. అయితే, ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ బిట్ కాయిన్ పుంజుకోవడం గమనార్హం.


అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇన్నాళ్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వడ్డీ రేట్లలో కోత పెట్టింది. ముందు ముందు సైతం వడ్డీ రేట్లలో మరింత కోత పెట్టేందుకు అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీని కారణంగా మదుపరులు క్రిప్టో కరెన్సీల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, క్రిప్టో కరెన్సీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో పెట్టుబడులపై రిస్క్ ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com