ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2.5 కోట్లు చెల్లించి 900 ఖైదీలను విడిపించిన భారతీయ వ్యాపారవేత్త

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 10:22 PM

ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాది ఫిరోజ్ మర్చంట్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఉపాధికోసం దుబాయ్ వెళ్లి.. అక్కడ అనుకోకుండా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైన 900 మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. ఇందుకోసం ఆయన రూ.2.5 కోట్లు చెల్లించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని భారతీయ వ్యాపారవేత్త, ప్యూర్‌ గోల్డ్‌ జువెలర్స్‌ యజమాని 66 ఏళ్ల ఫిరోజ్‌ మర్చంట్‌ దాతృత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆయన తన సొంత డబ్బుతో ఇప్పటి వరకూ 20 వేల మంది ఖైదీలకు జైలు నుంచి విడుదల చేయించారు.


సేవకార్యక్రమాలకు 2008లో ‘ది ఫర్‌గాటెన్‌ సొసైటీ’ని ఏర్పాటుచేసిన ఆయన.. విస్తృత స్థాయిలో సేవలందిస్తున్నారు. ఖైదీలు చెల్లించాల్సిన జరిమానాను తాను చెల్లిస్తూ.. వారు కారాగారాల నుంచి విడుదలయ్యేలా చూస్తున్నారు. వారిలో చాలా మంది స్వదేశాలకు వెళ్లేందుకు ప్రయాణ టికెట్లు కూడా సమకూర్చుతుంటారు. ఈ ఏడాదిలో మూడు వేలమంది ఖైదీలను విడుదల చేయించాలని ఫిరోజ్‌ మర్చంట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటిదాకా 900 మందిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


వీరిలో అత్యధికంగా అజ్మన్ జైలు నుంచి 495 మంది, ఫుజైరహ్ జైలు నుంచి 170 మంది, దుబాయ్ జైలు నుంచి 121, ఉమ్ అల్ ఖ్వువన్ జైలు నుంచి 66 మంది, రస్ అల్ ఖామహ్ జైలు నుంచి 28 మంది విడుదలయ్యారు. యూఏఈ సహనశీలతకు ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, తిరిగి వారిని కుటుంబాల చెంతకు చేర్చేందుకు తాను ఈ మిషన్‌ను ప్రారంభించినట్టు ఫిరోజ్ చెప్పారు.


‘ప్రభుత్వ అధికారులతో అనుబంధం ఉండడం నా అదృష్టం... ది ఫర్‌గాటెన్ సొసైటీ చొరవ మానవత్వం సరిహద్దులను దాటిందనే అంశంపై ఆధారపడింది. బాధితులు వారి సొంతదేశంలో, వారి సమాజంలో వారి కుటుంబంతో తిరిగి కలిసే అవకాశాన్ని అందించడానికి మేము కలిసి పని చేస్తాం’ అని పేర్కొన్నారు. తన సొంత ఖర్చులతో ఖైదీలను విడిపిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలిచారని ఫిరోజ్ మర్చంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


అజ్మాన్‌లోని కరెక్షనల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ మహ్మద్ యూసుఫ్ అల్-మత్రూషి మాట్లాడుతూ.. ఖైదీలకు సహాయం చేయడం, వారి పునరావాసం పట్ల ఇంత నిబద్ధత, శ్రద్ధచూపడం చాలా అరుదు అని అన్నారు. ‘వేలాది మంది ఫిరోజ్ మర్చంచ్‌కు కృతజ్ఞతతో రుణపడి ఉన్నారు.. జరిమానాలు చెల్లించలేని కారణంగా కటకటాల వెనుక కొట్టుమిట్టాడుతున్న వారికి నిజమైన ఆశను అందించడం గురించి నిశ్శబ్దంగా, వివేకంతో వ్యవహరించే విధానం చాలా ఆకట్టుకునేలా చేస్తుంది’ అని అల్-మత్రూషి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com