ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కోసం రెండు హెలికాప్టర్లు.. నెల అద్దె, ఇతర ఖర్చులు కలిపి ఎన్ని కోట్లంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 10:21 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం రెండు సరికొత్త హెలికాప్టర్లు సమకూర్చుకుంటోంది ప్రభుత్వం. సీఎం పర్యటనల కోసంవిజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఒకటి.. విశాఖపట్నం విమానాశ్రయంలో మరొకటి అందుబాటులో ఉంచనుంది. గ్లోబల్‌ వెక్ట్రా సంస్థ నుంచి అద్దె ప్రాతిపదికన రెండు ట్విన్‌ ఇంజిన్‌ హెలికాప్టర్లను తీసుకుంటోంది. ఒక్కోదానికి రూ.1,91,75,000 చొప్పున రెండింటికీ కలిపి నెలకు రూ.3,83,50,000 అద్దె చెల్లించనుంది. సీఎంగా జగన్‌ పదవీకాలం మే నెలాఖరు వరకు ఉంది.. అంటే ఈ మూడు నెలలకు హెలికాప్టర్ల అద్దెకే కేవలం రూ.11.50 కోట్లు ఖర్చవుతుంది.


అంతేకాదు గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలు, పైలట్లకు స్టార్‌ హోటళ్లలో బస, పైలట్లు, సాంకేతిక సిబ్బందికి రవాణా ఛార్జీలు, ఇంధన రవాణా ఛార్జీలు, హెలికాప్టర్‌ సిబ్బంది మెడికల్‌ ఖర్చులు, ఏటీసీ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించనున్నారు. హెలికాప్టర్లు సమకూర్చుకునేందుకు అనుమతిస్తూ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతలో ఉన్నారు. ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు, అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఐబీ చెబుతోంది. అందుకే సీఎం భద్రత ఏర్పాట్ల పట్ల అత్యంత సున్నితంగా వ్యవహరించాలంటోంది. ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ 2010 నుంచి బెల్‌ 412 వీటీ-ఎంఆర్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వినియోగిస్తోంది.


ఈ హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి పర్యటనలు పెరగటం, దానిలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తుండటంతో ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్‌ స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నిఘా విభాగం డీజీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ వెంటనే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ టెండర్లు పిలిచి ఈ రెండు హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది. వీటిని సీఎంతో పాటు ఇతర వీవీఐపీల పర్యటనలకూ వినియోగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. రెండు నెలల్లోగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భద్రత పేరు చెప్పి ప్రభుత్వ ఖర్చుతో కొత్త హెలికాప్టర్లు సమకూర్చుకుని, ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేందుకు వినియోగించుకోబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం సీఎంకు ముప్పు ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.


సీఎం జగన్ భద్రత అంశాన్ని సున్నితంగా పరిశీలించాలని ఇంటెలిజెన్స్ డీజీ చెబుతున్నారు. సీఎం జగన్ ఉఫయోగిస్తున్న బెల్ హెలికాప్టర్ 2010 నుంచి వాడుతున్నారు. ఆ హెలికాప్టర్ వెంటనే మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫారసు మేరకు సీఎం జగన్ కోసం అత్యాధునిక రెండు బెల్ హెలికాప్టర్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com