ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య ఆలయ ప్రతిష్ఠ.. సచిన్, కోహ్లీ, బిగ్-బి సహా 8 వేల మంది వీఐపీలకు ఆహ్వానం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 10:31 PM

వచ్చే ఏడాది జనవరి 22న జరగబోయే అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ మహోత్సవానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పారిశ్రామిక దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, బాలీవుడ్ బిగ్-బి అమితాబ్ బచ్చన్, నటులు అరుణో గోవిల్, రామాయణ సీరియల్‌లో సీతగా నటించి దీపికా చిఖాలియా సహా పలువురు ఉన్నారు.


మూడు వేల మంది ప్రముఖుల సహా 7 వేల మందికిపైగా ఆహ్వానాలను పంపినట్టు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామమందిర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబాలను ఆహ్వానించామని పేర్కొంది. వీరితో పాటు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్, యోగా గురు రాందేవ్, 4 వేల మంది సాధువులు, రచయితలు, జర్నలిస్ట్‌లు, శాస్త్రవేత్తలు, దేశంలోని ప్రముఖ వ్యక్తులకు ఆహ్వాన పత్రికలు పంపుతున్నామని చెప్పింది.


ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘50 దేశాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ప్రతినిధిని ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నాము. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబాలను కూడా ఆహ్వానించారు. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలకు కూడా ఆహ్వానాలు పంపాం. సాధువులు, పురోహితులు, శంకరాచార్యులు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, సంగీత విద్వాంసులు, పద్మ అవార్డు గ్రహీతలను కూడా ఆహ్వానిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.


‘‘రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్‌ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు.. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. తుది మెరుగులు దిద్దడానికి అత్యంత అందమైన విగ్రహం ఎంపిక చేస్తాం’ అని రాయ్ తెలిపారు. వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ మాట్లాడుతూ.. ‘రచనలు, నివేదికల ద్వారా రామ మందిర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జర్నలిస్టులను కూడా మేము ఆహ్వానించాం.. వారు లేకుండా రామ మందిరం కోసం పోరాటం విజయవంతం కాదు.’ అని అన్నారు. వీవీఐపీలకు బార్‌కోడ్ పాస్‌ల ద్వారా ప్రవేశం లభిస్తుంది. ‘7,000 మంది ఆహ్వానితులలో దాదాపు 4,000 మంది మత పెద్దలు ఉంటారు. మిగిలిన వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటారు. వేడుకకు ముందు ఆహ్వానితులకు ఒక లింక్ షేర్ చేస్తారు.. వారు దాని నమోదు చేసుకున్న తర్వాత, ఒక బార్ కోడ్ వస్తుంది’ అని శర్మ చెప్పారు.


‘సుదీర్ఘమైన పోరాటం తర్వాత, శ్రీరామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం పురోగతిలో ఉందని మీకు తెలుసు.. పుష్య శుక్ల ద్వాదశి, విక్రమ సంవత్సర 2080 సోమవారం, 22 జనవరి 2024, కొత్త రామ్ లల్లా విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడుతుంది.. ఈ మహత్తరమైన చారిత్రాత్మక దినం గౌరవాన్ని పెంపొందించడానికి, పవిత్రోత్సవానికి సాక్ష్యమివ్వడానికి మీరు ఈ పవిత్ర సందర్భంలో అయోధ్యలో ఉండాలనేది మా బలమైన కోరిక.’ అని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ సంతకంతో కూడిన ఆహ్వాన పత్రికలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com