ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకయ్య నాయుడి కుమార్తె గొప్ప మనసు,,,దత్తత తీసుకున్న యువతికి ఘనంగా పెళ్లి, ఫిక్స్‌డ్ డిపాజిట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 07:45 PM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారత్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్ గొప్ప మనసును చాటుకున్నారు. తాను దత్తత తీసుకున్న శిరీష అనే అమ్మాయి వివాహం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. పెళ్లి కుమార్తె పేరు మీద రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడంతో పాటు బంగారు నగలు కానుకగా అందజేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం నిడుంపల్లికి మడితపు శివయ్య, బుజ్జమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. మద్యానికి బానిసైన శివయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. కొంత కాలానికి భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌.. ఆ ఐదుగురిని 2016లో తమ ట్రస్టు ద్వారా దత్తత తీసుకుని చదివిస్తున్నారు. వీరిలో పెద్దమ్మాయి శిరీష వివాహ వేడుకల్లో దీపా వెంకట్‌ పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఏడేళ్ల కిందట దత్తత తీసుకున్న ఓ అమ్మాయిని చదివించి పెద్ద చేయడమే కాకుండా ఘనంగా వివాహం చేసి ఉదారతను చాటుకున్న దీపా వెంకట్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో శిరీషకు వివాహం చేశారు. మిగిలిన ప్రసన్న, మల్లీశ్వరి, నందిని, లిజితలను చదివిస్తూ.. వారి బాగోగులు చూస్తున్నారు. వారిని తమ ట్రస్టులోనే చదివిస్తున్నారు. మిగిలిన నలుగురు అమ్మాయిలకు కూడా తగిన వయసు రాగానే వివాహాలు చేయిస్తానని దీపా వెంకట్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com