ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుల బలహీనతను సొమ్ము చేసుకున్న పూజారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 03:08 PM

క్షుద్రపూజల పేరుతో భక్తులకు ఆలయ పూజారి శఠగోపం పెట్టి.. ఏకంగా 48 తులాల బంగారం దోచేశాడు. విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగరపువలసలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్మిత్ వీధికి చెందిన మహిళను తగరపువల సాయిబాబా గుడి పూజారి కుద్రపూజల పేరుతో బురిడీ కొట్టించాడు. పూజారి వీశాంత్ శ్రీను.. క్షుద్రపూజలు పేరుతో నమ్మించి 48 తులాల బంగారం దోచేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూజారితో పాటు ఆలయ ధర్మకర్త, మరో వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని ఆమె ఆరోపించారు.


బాధితురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు తొలుత పట్టించుకోలేదు. ఆలస్యంగా కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి వద్ద నుంచి కొట్టేసిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్, పెడరల్ బ్యాంకు‌లో తాకట్టు పెట్టినట్టు గుర్తించారు. రెండు చోట్ల 30 తులాల బంగారం తాకట్టు పెట్టగా.. మిగతాది ఏమైందో తెలియాల్సి ఉంది.


తాకట్టులో ఉన్న బంగారం రికవరీ కోసం బ్యాంకులకు భీమిలి పోలీసులు లేఖ రాశారు. సాయిబాబా గుడిలో అర్చకుడిగా ఉన్న శ్రీను గారడీలకు కొందరు భక్తులు బుట్టలో పడ్డారు. భక్తుల బలహీనతలు తెలుసుకుని వాటి ఆధారంగా నమ్మించి మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఓ భక్తురాలిని కూడా నమ్మించాడు. ఈ వ్యవహారంలో పూజారికి మరో ఇద్దరు కూడా సహకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే, రికవరీ విషయంలో అవినీతి జరిగిందని బాధితురాలు ఆరోపించడం గమనార్హం. ఈ విషయంలో విశాఖ సీపీ చొరవ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని బాధితురాలు అంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com