ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ సంఘర్షణపై జీ20 సదస్సులో ఏకాభిప్రాయం,,,ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపిన చైనా, రష్యాలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 08:08 PM

జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌కు భారీ విజయం దక్కింది. ఉక్రెయిన్ సంఘర్షణ, వాతావరణ మార్పులు వంటి అంశాలతో కూడిన ఢిల్లీ డిక్లరేషన్‌ను రష్యా, చైనా అంగీకరించాయి. గత ఏడాది ఇండోనేషియా వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ సంఘర్షణను చర్చించడానికి ఈ రెండు దేశాలు నిరాకరించాయి. కానీ, ప్రస్తుతం ఏకాభిప్రాయం కోసం భారత్ చేసి ప్రయత్నం ఫలించింది. రష్యా, చైనాలు ఉమ్మడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. మన అధికార బృందం, మంత్రుల కృషితో జీ20 శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు.


‘నాకు శుభవార్త అందింది. మా బృందం కృషి కారణంగా న్యూఢిల్లీ జీ20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడింది.. ఈ నాయకత్వ ప్రకటనను ఆమోదించాలనేది నా ప్రతిపాదన.. ఈ డిక్లరేషన్‌ని ఆమోదించారని నేను ప్రకటిస్తున్నాను. అందుకు కృషి చేసిన నా అధికారులు, మంత్రులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను’ అని మోదీ అన్నారు. ఉక్రెయిన్ సంఘర్షణ విషయంలో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా ఏ రాష్ట్ర రాజకీయ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవద్దు అని డ్రాఫ్ట్ డిక్లరేషన్‌ 3, 4వ పేరా పేర్కొంది. ప్రపంచంలో నమ్మకం కొరవడిందని, ఒకరికొకరు విశ్వాసం పెంచుకుని పాత సవాళ్లకు కొత్త పరిష్కారాలను కనుగొనాలని ప్రపంచ దేశాధినేతలను ప్రధాని మోదీ కోరారు.


‘ప్రపంచంలో ఎవరూ ఒంటరిగా ఉండకూడదని రష్యా నమ్ముతుంది.. రష్యాలో రెండు ముఖ్యమైన ఫోరమ్‌లు కూడా ప్రారంభం కాబోతున్నాయి’ అని ఒక రష్యన్ జర్నలిస్ట్ అన్నారు. గతేడాది జీ20 సదస్సులో ఉక్రెయిన్ సంఘర్షణను సూచించే ఉమ్మడి ప్రకటనలో ఉపయోగించిన అంశాన్ని ఆమోదించడానికి రష్యా, చైనా రెండూ నిరాకరించాయి. జీ20 ఒక ఆర్థిక వేదికని, దీనిపై భౌగోళిక రాజకీయ సమస్యలను చర్చించరాదని చైనా పట్టుబట్టగా.. పరిస్థితి మారిందని రష్యా వాదించింది. ఉమ్మడి డిక్లరేషన్‌పై తీవ్ర విభేదాల మధ్య శిఖరాగ్ర సమావేశం ముగింపులో ఆవిష్కరించబోయే డిక్లరేషన్‌ విషయంలో ఉక్రెయిన్ వివాదాన్ని వివరించడానికి భారత్ జీ20 దేశాల మధ్య కొత్త పేరాను చేర్చిచిందని దౌత్య వర్గాలు తెలిపాయి.


ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను బహిరంగంగా విమర్శించడం లేదా మాస్కో చర్యలను ఖండిస్తూ ఐరాసలో పెట్టిన తీర్మానాలపై ఓటింగ్‌‌కు భారత్ దూరంగా ఉంది. తక్షణమే యుద్ధాన్ని విరమించి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత నాయకత్వం నిరంతరం పిలుపునిచ్చింది. జీ20 అధ్యక్ష హోదా దేశం లోపల, వెలుపల ఐక్యతకు చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com