ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహిత శ్వేత కేసులో విస్తు గొలిపే విషయాలు వెలుగులోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:19 PM

అత్తంటివేధింపులకు ఎంతోమంది ఆడబిడ్డలు బలవుతూనే ఉన్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో విగతజీవిగా కనిపించిన వివాహిత శ్వేత (24) కేసులో మిస్టరీ కొనసాగుతోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత మృతదేహానికి కేజీహెచ్ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శవ పంచనామ నిర్వహించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్టు పోలీసుల చేతిలో ఉంది. ఆ నివేదికలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. శ్వేత మృతి కేసులో నిన్న సంచలన అంశం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్వేత ఆడపడచు భర్త సత్యం ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు శ్వేత తల్లి రమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆమె తెలిపారు. అతడిని నిలదీయాల్సిందిపోయి, శ్వేత చేతే అతడికి క్షమాపణ చెప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


శ్వేత తల్లి రమ ఫిర్యాదు ఆధారంగా ఆడపడుచు భర్త సత్యంపై లైంగిక వేధింపుల కేసు, అత్త-ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం శ్వేత భర్త, అత్త, మామ, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


పోస్టుమార్టం పూర్తిచేసిన తర్వాత శ్వేత మృతదేహాన్ని తల్లి రమ, బంధువులకు పోలీసులు అప్పగించారు. గురువారం (ఏప్రిల్ 27) కాన్వెంట్‌ కూడలి సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్వేత భర్త తరఫు వారందరూ పోలీసుల అదుపులో ఉండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు.


శ్వేత మంగళవారం రాత్రి 7.30 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటు వైపు వెళ్లిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. శ్వేత మృతదేహం లభ్యమైన బీచ్‌ రోడ్డులోని వార్‌ మెమోరియల్‌ స్తూపం సమీపంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది.


అన్న వరుసయ్యే తన ఆడపడుచు భర్త నుంచి శ్వేత లైంగిక వేధింపులు ఎదుర్కున్నారనే ఆరోపణలు ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నలుగురు నిందితులను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కస్టడీలోకి తీసుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com