ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల నుంచి చిరు ధాన్యాల పంపిణీ,,,రాయలసీమ జిల్లాల్లో ముందుగా ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:18 PM

ఏపీలో బియ్యం కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. మే 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు ఆ పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది.


పీడీఎస్‌ ద్వారా పేదలకు కూడా పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులు కూడా వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించేలా అవగాహన కల్పిస్తున్నారు. స్థానికంగానే రైతుల నుంచి చిరుధాన్యాల ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేయనున్నారు. ముందుగా రాయలసీమ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా రాగులు, జొన్నల పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తారు.


కేంద్రం కూడా చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే యూఎన్ ఓ 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలకు కూడా బియ్యం కంటే రాగులు, జొన్నలు పౌష్టికాహరంగా భావిస్తోంది ప్రభుత్వం. అలాగే అయ్యే ఖర్చే కూడా చాలా తక్కువ.. అందుకే చిరు ధాన్యాలను పంపిణీ చేయబోతోంది. అంతేకాదు ఈ చిరు ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా.. రైతులకు మద్దతు ధర దక్కుతుందని భావిస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పని ఉండదంటున్నారు.


అంతేకాదు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా.. పీడీఎస్ కింద.. గోధుమ పిండిని కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో బయట మార్కెట్లో కిలో గోధుమ పిండి రూ.40 ఉంటే.. ప్రభుత్వం మాత్రం రూ.16కే అందిస్తోంది.


అంతకాదు పీడీఎస్‌ అవసరాల కోసం నేరుగా రైతుల నుంచి వచ్చే ఖరీఫ్‌లో కందులు సేకరించాలని భావిస్తోంది పౌరసరఫరాల శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.45 కోట్ల రైస్‌ కార్డులు ఉంటే.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతోంది. బయట మార్కెట్‌లో రూ.120 నుంచి రూ.130 వరకు ఉంది. ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఇలా ఏపీ ప్రభుత్వం పీడీఎస్ ద్వారా ప్రజలకు పౌష్టికాహరం అందిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com