ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. విద్యార్థులు వేసవి సెలవుల కోసం తమ సొంత ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ కారణంగా తాజాగా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని నర్సాపూర్-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నర్సాపూర్-ఎస్ఎంవీటీ బెంగళూరు(07143) ట్రైన్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 నిమిషాలకు నర్సాపూర్లో బయలుదేరి శనివారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చే నెల 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది.
ఇక ఎస్ఎంవీటీ బెంగళూరు-నర్సాపూర్(07145) శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి ఆదివారం ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, జోలార్పేట్టై, బంగారుపాట్, కృష్ణరాజుపురం రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగనున్నాయి. ఏసీ-2 టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఈ ప్రత్యేక ట్రైన్లలో అందుబాటులో ఉండనున్నాయి.