విజయవాడలో లేడీ కిలాడీల చోరీ వ్యవహారం కలకలంరేపింది. అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి సీసీ ఫుటేజ్తో అడ్డంగా దొరికిపోయారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సినీ ఫక్కీలో ఈ దొంగతనం జరిగింది. ఇద్దరు మహిళలు ఓ బంగారం షాపుకు వెళ్లారు. తమకు ఫంక్షన్ ఉందని.. అర్జంట్గా వెళ్లాలని.. తమకు ఆభరణాలు కావాలని షాపు యజమాని దగ్గర హడావిడి చేశారు. యజమాని కూడా మహిళల్ని నమ్మి బంగారం తెచ్చి చూపించారు.
ఈలోపు ఇద్దరు మహిళలు అసలు బంగారం స్థానంలో తమ వెంట తెచ్చిన నకిలీ బంగారు నగలు ఉంచారు. ఆ తర్వాత షాపు యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి బంగారు నగలంతో పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత బంగారు షాపు యజమాని నకిలీ బంగారం చూసి అవాక్కయ్యాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అప్పుడు ఇద్దరు కిలాడీ లేడీల చోరీ వ్యవహారం బయటపడింది.
ఇద్దరు మహిళలు అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం మారుస్తున్న సీన్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. షాపు యజమాని కూడా ఇద్దరు మహిళలు హడావిడి పెట్టడంతో బంగారం మార్చే విషయాన్ని గమనించలేదని చెబుతున్నాడు. ఆ ఇద్దరి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.