ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో నమోదు చేసిన కేసుపై ,,ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన ఎమ్మెల్సీ సాబ్జీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 08:12 PM

తిరుమల శ్రీవారి ప్రొటోకాల్‌ దర్శనానికి సంబంధించిన కేసుపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ హైకోర్టును ఆశ్రయించారు. తనతో వచ్చిన భక్తుల ఆధార్‌ కార్డులను మార్చడంతోపాటు డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగ్గా.. ఆధార్‌ కార్డుల్లో అడ్రస్ తప్పుగా ఉందన్న ఆరోపణలకు పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ తరఫు లాయర్.


ఎమ్మెల్సీకి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటున్న వేణుగోపాల్‌, డ్రైవర్‌ డేగరాజు.. ఎమ్మెల్సీ దగ్గర పనిచేయడం లేదన్నారు. భక్తులకు దర్శనానికి సంబంధించి మాత్రమే టీటీడీ అధికారులకు సమాచారం మాత్రమే ఇచ్చారన్నారు. ఈ కేసులో రూ.1.07లక్షలు చేతులు మారాయని తేలినట్లు పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలనడంతో విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు.


తిరుమలలో ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ సాబ్జీపై కేసు నమోదైంది. తిరుమల టూ టౌన్ పోలీసులు.. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో సాబ్జీతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏ1గా వేణుగోపాల్, ఏ2గా డేగ రాజు, ఏ3గా సాబ్జీలను చేర్చారు. ఈ కేసులో వీరిపై సెక్షన్ 420 ,468, 472, రెడ్ విత్ 34 ఐపీసీ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


ఎమ్మెల్సీ గతవారం ప్రోటోకాల్ దర్శనం కోసం వేణుగోపాల్ అనే వ్యక్తి ద్వారా తిరుమల టీటీడీ అడిషనల్ ఈవోక కార్యలయానికి లేఖ పంపారు. 14మందికి దర్శన టికట్లు ఇవ్వాలని కోరారు. టీటీడీ ఎమ్మెల్సీతో పాటూ 10మందికి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టికెట్లు ఇచ్చింది. కానీ దర్శనానికి మాత్రం ఎమ్మెల్సీతో పాటూ మరో ఆరుగురు మాత్రమే వెళ్లారు. ఈ క్రమంలో సాబ్జీ వెంట వెళ్లిన భక్తుల ఆధార్ కార్డుల్ని తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ లేఖలో పేర్కొన్న వారి అడ్రస్ హైదరాబాద్ అని ఉంటే.. భక్తులు చూపించిన కార్డుల్లో బెంగళూరు అడ్రస్ ఉంది. దీంతో విజిలెన్స్ సిబ్బందికి అనుమానం వచ్చింది.


ఆధార్‌ కార్డులను ఫోర్జరీ చేసినట్లు విజిలెన్స్ సిబ్బంది ఆరోపించారు.. డ్రైవర్ డేగరాజు అకౌంట్‌‌లో కూడా డబ్బులు జమ చేసినట్లు తేలింది. ఎమ్మెల్సీతో పాటూ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎమ్మెల్సీకి 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి వదిలేశారు. డ్రైవర్ డేగరాజును అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాల్‌ మాత్రం ఇంకా దొరకలేదు. తనకు సంబంధం లేని విషయంలో కేసు నమోదు చేశారన్నారు. అంతేకాదు ఆధార్‌ కార్డులను మార్పు చేయాల్సిన అవసరం ఏముందని.. ఈ వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు రావాలన్నారు. ఆ డ్రైవర్ ఎవరో తనకు తెలియదన్నారు.. ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.. పిటిషన్ దాఖలు చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com