ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలంలో మరో అపచారం,,,స్వామివారి నిజరూప దర్శనం వీడియో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 10:12 PM

సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో మరో అపచారం జరిగింది. స్వామివారి నిజరూప దర్శనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజరూప దర్శనంను మొబైల్‌లో రికార్డ్ చేశారు. దీంతో చందనోత్సవం భద్రతపై విమర్శలు వస్తున్నాయి. అప్పన్న నిజరూపదర్శనం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


భక్తులు అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి ఏడాది పొడవున ఎంతగానో ఎదురుచూస్తారు. అక్షయ తృతీయనాడు ఒక్క రోజు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారు. అంతటి పవిత్రమైన స్వామివారి నిజరూప దర్శనం వీడియో బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి. గతేడాది కూడా ఇలాగే జరిగిందని.. మళ్లీ ఈసారి కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆగమ శాస్త్రానుసారం స్వయంభూ మూర్తుల వీడియో, ఫొటో తీయకూడదు. గతేడాది చందనోత్సవం రోజున కూడా కొందరు భక్తులు నిజరూప దర్శనం వీడియో తీశారు. మళ్లీ ఇప్పుడు అలాగే జరగడం కలకలంరేపుతోంది.


ఈనెల 23న జరిగిన చందనోత్సవంలో భక్తులకు ఎదురైన ఇబ్బందులపై విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్ దేవస్థానం పరిపాలన కార్యాలయంలో తనిఖీ నిర్వహించారు. భక్తులకి కలిగిన అసౌకర్యం, తాగునీరు వైద్య సదుపాయాల మీద విచారణ జరిపారు. అలాగే ప్రోటోకాల్ టికెట్లు మీద కూడా ఎన్ని జారీ చేశారన్న అంశంపైనా ఆరా తీశారు. కొన్ని రికార్డులను పరిశీలించారు.. టికెట్ల జారీకి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను తనిఖీచేసి.. టికెట్లు, వాహనపాసుల జారీపై విచారణ చేశారు.


తొలిరోజు విచారణలో ప్రాథమిక సమాచారం మాత్రమే లభించిందన్నారు డిప్యూటీ కలెక్టర్. మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని.. సీసీ ఫుటేజీల పరిశీలన, మరికొందరు సిబ్బంది విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఈ విచారణ మరో నాలుగు రోజులు పాటు కొనసాగుతుందని డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్ తెలిపారు. త్వరగా విచారణ పూర్తిచేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు. చందనోత్సవం రోజు కూడా భక్తులు ఇబ్బందిపడ్డారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి.. సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.


మరోవైపు కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా జిల్లా దేవదాయ శాఖ అధికారిణి కె.శిరీషకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవస్థానం ఈవోగా ఉన్న రమేష్ నాయుడు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈవోగా వెళ్లారు. దీంతో శిరీషకు కనకమహాలక్ష్మి దేవస్థానం బాధ్యతలు అప్పగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com