ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ ఎపిసోడ్ తర్వాత.. ముఖ్తార్ అన్సారీ కుటుంబం తెరపైకి వచ్చింది. దీంతో ముఖ్తార్ అన్సారీ, అతని కుమారుడు అబ్బాస్ అన్సారీలకు కష్టాలు పెరుగుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా.. జైల్లో ఉన్న తండ్రీకొడుకులను ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు విచారించవచ్చని ప్రచారం జరుగుతోంది. రూ.125 కోట్ల వ్యవహారం కేసులో వీరిని విచారించే ఛాన్స్ ఉంది.
మరోవైపు ముఖ్తార్ అన్సారీ భార్య అఫ్షాన్పై ఉత్తరప్రదేశ్ పోలీసులు 50 వేల రివార్డును పెంచారు. ముఖ్తార్ అన్సారీ 2021 నుంచి బందా జైలులో ఉన్నారు. యూపీతో పాటు పంజాబ్లో కూడా ముఖ్తార్పై కేసులు నమోదయ్యాయి. 1987లో ఓ కాంట్రాక్టు విషయంలో ముఖ్తార్పై మొదటిసారి హత్య ఆరోపణలు వచ్చాయి. ముఖ్తార్ అన్సారీపై ఇప్పటి వరకు 61 కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూపీ పోలీసులు నేరస్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పోలీసులు రివార్డు ప్రకటించిన 12 మంది నేరస్థుల పేర్లు ఉన్నాయి. ఇందులో ముఖ్తార్ అన్సారీ భార్య అఫ్షాన్ అన్సారీ పేరు కూడా ఉంది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్షాన్ అన్సారీపై 406, 420, 386, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ముఖ్తార్ అన్సారీ, అఫ్జల్ అన్సారీలకు సంబంధించి గ్యాంగ్స్టర్ చట్టం కింద ఘాజీపూర్ ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టులో ఏప్రిల్ 29న నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. 2005లో మౌ అల్లర్లకు సంబంధించి అన్సారీపై ఆరోపణలు వచ్చాయి. ఈ అల్లర్ల తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.