ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ లో ఘాతుకం..మసీదులో ఆత్మహుతి దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:50 PM

ఓవైపు ఆర్థికంగా సతమతమవుతున్న పాకిస్తాన్ లో తాజాగా ముష్కర ముకలు చేలరేగిపోయాయి. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబ్డాయి. పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన పాకిస్థాన్‌లో సోమవారం చోటుచేసుకుంది. పాక్ వాయువ్య నగరం పెషావర్‌లో జరిగిన ఈ పేలుడులో 150 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ 28 మంది చనిపోయినట్టు సమాచారం. వీరిలో ఎక్కువ మంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మసీదులో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్టు పోలీసులు తెలిపారు.


పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా జనం ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లింది. పేలుడు తర్వాత మసీదు భవనంలోని కొంత భాగం దెబ్బతిని శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు పోలీస్ అధికారి సికిందర్ ఖాన్ తెలిపారు. పేలుడు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెషావర్‌లోని సమీప ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి అధికార ప్రతినిధి మహ్మద్ అషిమ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తమ ఆస్పత్రికి 70 మంది క్షతగాత్రులను తీసుకొచ్చారని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.


ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబులెన్సులతో పాటు ఇతర వాహనాలతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గతేడాది మార్చిలోనూ షియా ముస్లింలే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ ఉగ్రమూకలు పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడి 64 మందిని పొట్టనబెట్టుకున్నారు. 2018 తర్వాత ఈ స్థాయితో ఉగ్రదాడి జరగడం అదే మొదటిసారి. ఇప్పుడు కూడా అదే విధంగా ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com