ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. మంగళవారం అక్కడ జరగనున్న జీ-20 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో సీఎం పాల్గొనడంపై ముందస్తు సమాచారమేదీ లేదు. శనివారం అకస్మాత్తుగా ఇది తెరపైకి వచ్చింది. అనూహ్యంగా జగన్ ఢిల్లీ వెళ్లడంపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అధ్యాయం మొదలైంది. ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. శనివారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అవినాశ్రెడ్డిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఖాయమని, వివేకా కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయల్సిందిగా కేంద్ర పెద్దలను కలవడం ఖాయమని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి అనుగుణంగానే సోమవారం సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు.