ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్ ఖురేషీ మృతిచెందారు..ప్రకటించిన ఐసీస్

international |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:05 AM

తమ నేత అబూ అల్ హసన్ హషిమీ అల్ ఖురేషీ మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్‌) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేసిన ఐసిస్.. అబు అల్‌-హసన్‌ స్థానంలో ఐఎస్‌ కొత్త చీఫ్‌గా అబూ అల్‌-హుస్సేన్‌ అల్‌-హుస్సేని అల్‌-ఖురేషీని నియమించినట్లు తెలిపింది. ఈ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి ఐఎస్ కొత్త చీఫ్‌ అబూ అల్‌-హుస్సేన్‌ అని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో అబూ అల్‌-హసన్‌ చనిపోయినట్లు ఇందులో పేర్కొన్నారు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.


అబూ అల్‌-హసన్‌కి ముందు ఐసిస్‌ చీఫ్‌గా ఉన్న అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర సిరియా ప్రాంతంలోని ఇడ్లిబ్‌ ప్రావిన్సుల్లో అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో వారికి చిక్కకుండా తనను తాను పేల్చేసుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు. అమెరికా కమాండోల దాడిలో ఐఎస్ చీఫ్ అబూ బకర్‌ అల్‌-బగ్దాది హతమైన తర్వాత 2019 అక్టోబరు 31న అతడి స్థానంలో ఖురేషీ వచ్చాడు. తాజాగా అబూ అల్-హసన్‌ మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.


ఇరాక్, సిరియాలో 2014లో పలు ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2017లో ఇరాక్‌, తర్వాత రెండేళ్లకు సిరియాలో ఐఎస్‌ను అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ సేనలు చావుదెబ్బ కొట్టాయి. సున్నీ ముస్లిం తీవ్రవాద సమూహం స్లీపర్ సెల్‌లు ఇప్పటికీ రెండు దేశాలలో దాడులను నిర్వహిస్తున్నాయి.


ఇరాక్, సిరియాలలో క్రమంగా కనుమరుగైన ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రపంచ భద్రతకు పెను సవాలును విసురుతోంది. దీనికి కారణం దాదాపు 30,000 మంది విదేశీయులు ఆ సంస్థలో చేరడమే. వీరంతా తమ సొంత దేశాలకు తిరిగి వచ్చారు. ఐఎస్ ఖలీఫా రాజ్యాన్నికూల్చి వేసినందుకు చాలా మంది ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ సహా పలు దేశాల్లో ఇటీవల ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరుల కార్యకలాపాలు పెరిగినట్టు నిఘా వర్గాలు నివేదికలు హెచ్చరించిన విషయం తెలిసిందే. స్వదేశాలకు వచ్చినవారిలో కొందరు రహస్యంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను అవకాశంగా తీసుకొని విధ్వంసానికి పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com