ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీరు మార్చుకొని పాకిస్తాన్...మనదేశంలోకి డ్రోన్లు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:24 AM

పాకిస్తాన్ తన వక్రబుద్దిని మార్చుకోవడంలేదు. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు నిత్యం కొనసాగుతున్నాయి. అమృత్‌సర్ సమీపంలో డావోకే గ్రామ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి భారత్‌లోకి వస్తున్న డ్రోన్‌ను భద్రతా సిబ్బంది పసిగట్టి కూల్చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం భారత భూభాగంలోకి చొరబడుతున్న మరో డ్రోన్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా విభాగం కూల్చివేసింది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఒక డ్రోన్‌తో పాటు అనుమానాస్పద వస్తువును కూడా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌సర్ జిల్లా చహర్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


భారత భూభాగంలోకి డ్రోన్ చొరబడడాన్ని గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపారు. దీంతో దాయాది పాక్ మరో స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు సైనిక అధికారులు తెలిపారు. చహర్‌పూర్ గ్రామ సమీపంలోని సరిహద్దు ఫెన్సింగ్‌ వద్ద ఉన్న పంట పొలాల్లో పడి ఉన్న తెల్లటి రంగు పాలిథిన్‌ బ్యాగులో అనుమానిత వస్తువును గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 3.1 కిలోల డ్రగ్స్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన అనుమానిత పాక్ డ్రోన్‌ను గురిచూసి కొట్టిన మహిళా జవాన్‌ను బీఎస్ఎఫ్ డీఐజీ ప్రభాకర్ జోషి అభినందించారు. నవంబరు 26న డావోకే గ్రామంలో పాక్ డ్రోన్‌ను కూల్చివేయగా.. పఠాన్‌కోట్‌ సరిహద్దు సమీపంలో ఇద్దరు చొరబాటుదారులను ప్రయత్నాలను బీఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు.


సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన థర్మల్ ఇమేజింగ్ కెమెరాలో పాక్ చొరబాటుదారుల కదలికలు రికార్డయ్యాయి. గతేడాదితో పోల్చితే సరిహద్దుల్లో పాకిస్థానీ డ్రోన్‌ల చొరబాటు భారీగా పెరిగింది. సరిహద్దు వెంబడి ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 230 డ్రోన్‌లను గుర్తించారు. వీటి ద్వారా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తోందని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. 2021లో 104 డ్రోన్లను గుర్తించగా.. 2020లో ఇది 77గా ఉంది.


పంజాబ్ సరిహద్దుల్లో 2020 నుంచి ఇప్పటి వరకూ కనీసం 297 డ్రోన్లను గుర్తించారు. అలాగే, ఈ ఏడాది అక్టోబరులో గుజరాత్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోనూ అనుమానిత డ్రోన్ కార్యకలాపాలు నమోదయ్యాయి. సరిహద్దుల్లో గస్తీ కట్టుదిట్టం చేయడంతో డ్రోన్‌లతో కశ్మీర్‌లో ఉగ్ర మూకలకు ఆయుధాలు, దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయడానికి పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాని ప్రయత్నాలను భారత్ చిత్తుచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com