ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు రికార్డు ఆదాయం..,కేవలం 10 రోజుల్లోనే రూ.52.55 కోట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:23 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నవంబరు 16న మండల-మకరవిలక్కు పూజల కోసం తెరుచుకోగా.. ఈ సీజన్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామివారికి ఆదాయం రికార్డుస్థాయిలో సమకూరుతోంది. కేవలం 10 రోజుల్లోనే రూ.52.55 కోట్లు ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపన్‌ వెల్లడించారు. ఇందులో సగం ఆదాయం ప్రసాదాల విక్రయం ద్వారా వచ్చిందే కావడం విశేషం. అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్ల ఆదాయం వచ్చినట్లు గోపన్ తెలిపారు. దేవస్థానంలో హుండీల ద్వారా రూ. 12.73 కోట్ల సమకూరినట్టు అనంత గోపన్‌ పేర్కొన్నారు.


గతేడాది ఇదే సమయానికి రూ.9.92 కోట్లు మాత్రమే లభించిందని ఆయన తెలిపారు. వచ్చే 20 రోజులకు సరపడే 51 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయన్నారు. రోజుకు సగటున రెండున్నర లక్షల డబ్బాలు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్ల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించడంతో ఆలయానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుతున్నారు.


ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించిన కేరళ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. దర్శనం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. టైమ్ స్లాట్ విధానం వల్ల భక్తుల ఎక్కువ సేపు నిరీక్షణ లేకుండా సన్నిధానంలోకి చేరుకుంటున్నారు. అలాగే, దర్శన వేళలను కూడా పెంచారు. గతంలో ఉదయం 3 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు దర్శనాలను అనుమతించేవారు. రద్దీ నేపథ్యంలో సాయంత్రం దర్శనాలను ముందుకు జరిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అనుమతిస్తారు.


అయితే, సన్నిధానం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కోసం కేరళ ప్రభుత్వం ముద్రించిన హ్యాండ్‌బుక్‌పై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. భక్తుల ఆందోళనలతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ హ్యాండ్‌బుక్‌ను ఉపసంహరించుకుంది. ‘సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పు ప్రకారం భక్తులందరికీ అయ్యప్ప సన్నిధానంలో ప్రవేశార్హత ఉంటుంద’ని ఓ నిబంధనగా పేర్కొనడం దుమారానికి కారణమయ్యింది. అన్ని వయసుల మహిళలకు అనుమతి విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా.. దీనిపై పలు హిందూ సంఘాలు, భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com