ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే... తుది జట్టు ఇదేనా?

sports |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 01:15 PM

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికర మ్యాచ్ కు సిద్ధమైంది. సగం మంది ఆటగాళ్లతో పాటు టీ20 ఫార్మాట్‌లో ఆడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంటికి చేరుకున్నాడు. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లతో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో గబ్బర్ సేన తలపడనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని టీమ్ ఇండియా భావిస్తోంది. కానీ సీనియర్లు రోహిత్, కోహ్లీ లేకపోవడం కుర్రాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం. అయితే తుది జట్టులో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 


టీ20 సిరీస్‌లో అవకాశం దక్కించుకోని సంజూ శాంసన్‌కు కనీసం వన్డే సిరీస్‌లోనైనా అవకాశం లభిస్తుందా? అంటే అవుననే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అతనికి ఆల్ రౌండర్ దీపక్ హుడాతో పోటీ ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఆడనుండగా, సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడనున్నారు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో వరుసగా విఫలమైన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టాలని భావిస్తే మాత్రం సంజూ శాంసన్‌ చోటుకు డోకా లేదు. కానీ అయ్యర్‌కు మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ హోదాలో జట్టులో చోటు దక్కనుంది. టీ20ల్లో ఘోరంగా విఫలమైన అతనికి ఈ సిరీస్ చాలా కీలకం. ఇక్కడ విఫలమైతే.. జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. సంజూ శాంసన్, దీపక్ హుడాలలో ఒకరు ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంటారు. ఆల్ రౌండర్ కావాలంటే దీపక్ హుడా జట్టులోకి వస్తాడు. టీ20ల్లో సత్తా చాటాడు. దీపక్ హుడా జట్టులో ఉంటే టీమ్ ఇండియాకు అదనపు బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. టీమ్ మేనేజ్ మెంట్ కూడా ఆల్ రౌండర్లకే ప్రాధాన్యత ఇస్తుందని టీ20 సిరీస్ తో తేలిపోయింది. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడటం ఖాయం కాగా.. అర్ష్‌దీప్ సింగ్ మరో పేస్ బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక మూడో పేసర్ ఆప్షన్స్‌లో ఉమ్రాన్ మాలిక్‌కు సీనియర్ దీపక్ చాహర్‌తో పోటీ నెలకొంది. ప్రపంచకప్ ముందు గాయంతో జట్టు దూరమైన దీపక్ చాహర్ మళ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రేపు ఉదయం 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. 
తుది జట్టు(అంచనా):  శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్/దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్ /దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com