ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర తుపానుగా వాయుగుండం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 10:17 PM

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో.. రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది.


ప్రస్తుతం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. పారాదీప్‌కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం (అక్టోబర్ 23) నాటికి తుఫానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీ వరకు తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది.


ఈ తుపాను ప్రభావంతో గురువారం రోజు రాత్రి.. శుక్రవారం (అక్టోబర్ 25న) రోజు ఉదయం ఒత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతమైన పూరీ, సాగర్‌ ద్వీపం మధ్య తుపాను తీరం దాటే ఛాన్స్ ఉందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే.. ఉపరితల ద్రోణి వాయుగుండం నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పింది.


ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 22న) రోజున.. తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.


ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. గురువారం (అక్టోబర్ 24న), శుక్రవారం (అక్టోబర్ 25న) ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఇక.. బుధవారం రోజున కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com