రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు.సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని తాము ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడానికి వెళ్తుంటే పోలీసులు ఎవరి డైరెక్షన్లో తమను అడ్డుకుంటున్నారో రాచకొండ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గాదరి కిశోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి, 12 లక్షల చెట్లు కొట్టి నాశనం చేయడం, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీతో ధర్మారెడ్డి కాల్వలో వ్యర్థాలు పోయడం నాశనం కాదా అని ప్రశ్నించారు. మూసీ వల్ల నల్లగొండ నాశనమైతుందన్న కోమటిరెడ్డి ఇయ్యాల అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణకు ఎందుకు రాలేదన్నారు. మూసీనీ కాదు, ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోర్లను ప్రక్షాళన చేయాలన్నారు.ఇంజినీర్లకు సీనియర్ ఇంజినీర్గా సలహాలు ఇస్తున్నావు కదా, అసలు నీవు ఎక్కడ ఇంజినీర్ చేశావో తెల్వదా అని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. ఓ కాల్వ నిర్మాణంలో సూపర్వైజర్గా పనిచేస్తూ, ఆ కాల్వ సిమెంట్ అమ్ముకొని మర్రిగూడ జగతయ్యతో బీర్లు తెచ్చుకొని కాల్వలో తాగిన విషయం అందరికీ తెలుసన్నారు. అలాంటి కోమటరెడ్డి.. కేటీఆర్ను విమర్శించే స్థాయికి ఎదిగావా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ర్టానికి, కనీసం సొంత రాష్ట్రమైన గుజరాత్కు కూడా రూపాయి ఇవ్వని అదానీ సీఎం రేవంత్కు రూ.100 కోట్లు స్కిల్ డెవల్మెంట్ పేరుమీద, మరో రూ.వెయ్యి కోట్లు వారి అధిష్టానానికి ఇవ్వడానికి కారణం ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులను అప్పజెప్పేందుకే అని దుయ్యబట్టారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఎవరూ సమర్థించడం లేదని, హైడ్రా పేరుతో సామాన్యులు, రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదని రైతులు, ఉద్యోగాలు వేయడం లేదని నిరుద్యోగులు, రీయింబర్స్మెంట్ లేదని విద్యార్థులు, పింఛన్ ఇవ్వడం లేదని వృద్దులు, 29 జీవోతో నిరుద్యోగ అభ్యర్థులు.. ఇలా రాష్ట్రంలో తిట్టని వాళ్లే లేరని కిశోర్ కుమార్ పేర్కొన్నారు.