ట్రెండింగ్
Epaper    English    தமிழ்

75% పూర్తైన ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణం.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 06:55 PM

ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి నిర్మాణ పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. 75 శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబరు లోగా పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం మిషన్ మోడ్‌లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఆస్పత్రి (AIIMs Bibinagar) అందుబాటులోకి వస్తే, తెలంగాణ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1365 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు.


ఇప్పటికే ఈ ఆస్పత్రిలో 33 విభాగాల్లో సేవలు ప్రారంభించారు. రోగుల తాకిడి పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న ఎయిమ్స్ తొలి బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం ఇక్కడే ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు.


బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 2019-20 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభమయ్యాయి. 2020 జూన్‌ 2న ఆస్పత్రిలో ఓపీ సేవలు మొదలయ్యాయి. 2023 ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు సుమారు రూ. 650 కోట్లు ఖర్చు చేసి 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు.


ఎయిమ్స్ భవనాలు - అంతస్తులు


కొత్త ఆస్పత్రి - 4


అకడమిక్ బ్లాక్ - 5


అమృత్ నివాస్ - 3


గెస్ట్ హౌస్ & క్లబ్ - 2


టైప్ 2 క్వార్టర్స్ - 15


టైప్ 3 క్వార్టర్స్ - 15


టైప్ 4 & 5 క్వార్టర్స్ - 23


టైప్ 6 క్వార్టర్స్ - 5


యూజీ గర్ల్స్ హాస్టల్ (ఎంబీబీఎస్, నర్సింగ్) - 19


యూజీ బాయ్స్ హాస్టల్ (ఎంబీబీఎస్, నర్సింగ్) - 18


పీజీ బాయ్స్ & గర్ల్స్ హాస్టల్ భవనం - 16


పీజీ వివాహితులు, నర్సులు, ఇంటర్నేషనల్ స్కాలర్ల హాస్టల్ - 20


ఆయుష్ భవనం - 1


ఆడిటోరియం - 1


డైరెక్టర్ బంగ్లా - 1


డైనింగ్ హాల్ - 1


కమ్యూనిటీ బ్లాక్ - 1


సర్వీస్ బిల్డింగ్ - 1


మార్చురీ - 1


ఎయిమ్స్‌‌లో ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్‌‌లో 50 మంది వైద్య విద్యార్థులు గతేడాది వైద్య విద్య పూర్తిచేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇదే ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. 2019లో ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లలో విద్యార్థులు చేరారు. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో 411 మంది విద్యార్థులు చదువుతున్నారు.


హైదరాబాద్‌లో ఎయిమ్స్ ఎక్స్‌టెన్షన్ భవనం


మరోవైపు.. హైదరాబాద్ నగరంలో ఎయిమ్స్ బీబీనగర్ ‘అర్బన్ హెల్త్ అండ్‌ ట్రైనింగ్ సెంటర్‌’ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన, శిక్షణా కార్యక్రమాలను అందించడంతో పాటు, నగరంలో నివసిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని ఎయిమ్స్ బీబీనగర్ ప్రతినిధులు తెలిపారు.


ఎయిమ్స్ బీబీనగర్ ఎక్స్‌టెన్షన్ కోసం హైదరాబాద్ నగరంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టులో లేఖ రాశారు. అప్పటివరకూ తాత్కాలికంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కేటాయించినట్లయితే, అక్కడ ఎయిమ్స్ బీబీనగర్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్ అండ్‌ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసి సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com