ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రాంతాలు, ఇతర గ్రామీణ ప్రాంతాలలో వచ్చిన మొత్తం 42,942 ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు, వివరాలను మండలాల వారీగా కలెక్టర్ తెలుసుకుంటూ పెండింగ్ ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రుటిని ప్రక్రియ 4 దశలలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం/మున్సిపాలిటీ లలో బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేస్తూ అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, హెరిటేజ్ బిల్డింగ్, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలో వస్తుందో లేదో చెక్ చేసి ధ్రువీకరించాలని అన్నారు.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ లెవల్ సర్వే ధృవీకరణ ప్రక్రియ దరఖాస్తులు యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ పక్కాగా జరగాలని అన్నారు. మొదటి దశలో ధ్రువీకరణ పూర్తి చేసుకున్న దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, రోడ్డు వెడల్పు ఓపెన్ స్పేస్ మొదలగు నిబంధనలు లేఔట్ లో పాటించారా అనే అంశాన్ని పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారి ఆమోదించాలని, ఎల్.ఆర్.ఎస్ క్రింద భూముల క్రమబద్దీకరణకు జనరేట్ ఐన ఫీజు వివరాలు దరఖాస్తుదారులకు తెలియజేసి త్వరగా చెల్లించేలా ఫాలో అప్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రతి మండలం పరిధిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను అధికారులు నిర్దేశిత సమయంలోగా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఇన్చార్జి డీపీఓ శేషాద్రి, ఇరిగేషన్ ఈ.ఈ అమరేందర్ రెడ్డి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలి బేగ్, సంపత్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.ఓ.లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.