ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుకు తెలియకుండానే రూ.20 లక్షల లోన్.. ఇది సరికొత్త మోసం, అకౌంట్ ఓసారి చెక్ చేసుకోండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 07:07 PM

ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుతో తరహా కొత్త మోసంతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రముఖ వ్యక్తుల సోషల్‌ మీడియా అకౌంట్ల డీపీలు ఉపయోగించి డబ్బులు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొరియర్‌ పార్సిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ అమాయకులకు ఫోన్లు చేసి అన్యాయంగా డబ్బులు గుంజుతున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి తెరతీశారు సైబర్ కేటుగాళ్లు.


ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి బ్యాంకులను బురిడీ కొట్టించారు. మెుత్తం ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. సదరు బాధితుడు పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జగిత్యాల జిల్లాకు చెందిన బాధిత రైతు జిల్లా అధికారులను, పోలీసులను ఆశ్రయించాడు.


వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి ఆధార్ కార్డును ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు మోసానికి తెరతీశారు. నారాయణ ఆధార్ కార్డుపై ఫోటోను మార్చి ఫేక్ పాన్‌కార్డు సృష్టించారు. పాన్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డు ద్వారా హైదరాబాద్ నగరంలోని ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. 2018లో లోన్ తీసుకోగా.. ఇప్పటివరకు రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. అయితే గత కొ న్ని రోజులుగా నారాయణకు బ్యాంకు నుంచి డబ్బులు చెల్లించాలని కాల్స్ వస్తుండగా.. అవి సైబర్ కాల్స్ అని భావించి వదిలేశాడు.


అయితే ఇటీవల తన వ్యవసాయ భూమిపై లోన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా.. అక్కడ అసలు విషయం తెలిసింది. నారాయణ ఆధార్ కార్డు, పాన్ కార్డు చెక్ చేయగా..ఇప్పటికే లోన్ ఉందని ఆ డబ్బులు చెల్లించకుండా కొత్తగా లోన్ ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో ఖంగుతున్న రైతు నారాయణ..తనకు బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా ఆరా తీశాడు. బ్యాంకులకు వెళ్లి చూడగా.. అక్కడ ఆధార్ కార్డులో నెంబర్ మాత్రం నారయణదే ఫోటో మాత్రం మార్ఫింగ్ చేశారు. దీంతో నారాయణ ప్రజావాణిలో ఫిర్యాదు చేయటంతో పాటుగా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


కాగా, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మన అకౌంట్లలోని డబ్బులు కూడా కొట్టేసే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్‌ నేరస్థులు సొమ్ములు కొట్టేస్తే వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com